Aqua Zone : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు ఆక్వా రైతులకు ఆర్థిక చేయూతనిచ్చే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు కేవలం నోటిఫై చేసిన ‘ఆక్వా జోన్’ పరిధిలోని రైతులకు మాత్రమే విద్యుత్ రాయితీ లభిస్తుండగా, ఇకపై ‘నాన్ ఆక్వా జోన్’లలో సాగు చేస్తున్న రైతులకు కూడా ఉపశమనం కలిగించాలని నిర్ణయించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం జోన్లతో సంబంధం లేకుండా, నాన్ ఆక్వా జోన్లలోని రైతులకూ యూనిట్ విద్యుత్ను కేవలం ₹1.50లకే అందించనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో దశాబ్దాలుగా ఉత్పాదన వ్యయం పెరిగి నష్టాల్లో కూరుకుపోతున్న వేలాది మంది నాన్ ఆక్వా జోన్ రైతులకు తీవ్ర ఊరట లభించినట్లయింది.

ఈ నెల నుంచే అమలు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
ఈ సబ్సిడీ పథకాన్ని ఈ నెల నుంచే తక్షణమే అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆక్వా సాగులో విద్యుత్ బిల్లులే సింహభాగం కావడం వల్ల, రాయితీని విస్తరించడం ద్వారా ఆక్వా ఉత్పత్తుల నాణ్యత, ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో విద్యుత్ రాయితీ లేక నాన్ ఆక్వా జోన్ల రైతులు తీవ్ర నష్టాలను చవిచూడగా, ఈ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ఆక్వా రంగం మరింత పుంజుకోనుంది. జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా సాగుదారులందరికీ సమాన ప్రాతిపదికన సబ్సిడీ ఫలాలు అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ తగిన ఏర్పాట్లు చేస్తోంది.

