Gold : స్నేహాన్ని ఆసరాగా చేసుకుని, అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఒక వ్యక్తి ఆడిన గుప్తనిధుల నాటకం నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది.
నిజామాబాద్ (NZB) టౌన్లోని హమాల్వాడీకి చెందిన రమేష్, శ్రీనివాస్ ఇద్దరూ ప్రాణస్నేహితులు. ఈ క్రమంలో రమేష్ వద్ద శ్రీనివాస్ రూ. 1.30 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. కొంతకాలం తర్వాత రమేష్ తన డబ్బులను తిరిగి ఇవ్వాల్సిందిగా శ్రీనివాస్ను గట్టిగా నిలదీశాడు. దీంతో డబ్బులు ఎగ్గొట్టేందుకు పక్కా ప్లాన్ వేసిన శ్రీనివాస్… తనకు గుప్తనిధులు దొరికాయని, అందులో లభించిన బంగారమే ఇదని నమ్మబలుకుతూ కొన్ని రాళ్లను రమేష్కు అందించాడు.
వెలుగుచూసిన కంకర రాళ్ల భాగోతం: పోలీస్ స్టేషన్ మెక్కిన బాధితుడు
స్నేహితుడు ఇచ్చిన రాళ్లను చూసి అనుమానం వచ్చిన రమేష్, వెంటనే వాటిని నిపుణుల చేత పరీక్షించాడు. ఆ పరిశీలనలో అవి అసలైన బంగారం కాదని, సాధారణ కంకర రాళ్లకు మెరిసే బంగారం పూత పూసి తనను మోసం చేశాడని తేలడంతో రమేష్ షాక్కు గురయ్యాడు. తాను నమ్మిన స్నేహితుడే ఇలా మోసం చేయడంతో విసిగిపోయిన బాధితుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడైన శ్రీనివాస్పై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.

