పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశ ఆర్థిక చరిత్రలోనే ఒక కీలక మైలురాయిని నమోదు చేసింది. 2026 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా ప్రకటించిన మొత్తం పెట్టుబడుల్లో ఏకంగా 25.3 శాతం వాటాను సొంతం చేసుకుని ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది.
ఈ విషయాన్ని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించినట్లుగా ఫోర్బ్స్ ఇండియా తన కథనంలో వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి ఏపీ ముందుకు రావడం దేశ పారిశ్రామిక గమనంలో పెద్ద మార్పును సూచిస్తోందని నివేదక తెలిపింది. ఫోర్బ్స్ ఇండియా(Forbes India) నివేదిక ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా మొత్తం రూ.26.6 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి.

ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 11.5 శాతం అధికం. ఈ పెట్టుబడుల్లో సగానికి మించిన వాటా అంటే 51.2 శాతం కేవలం మూడు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమైంది. అందులో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా..ఒడిశా (13.1%), మహారాష్ట్ర (12.8%) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ అద్భుత విజయంపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో ఆయన స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ఇక ఇతర రాష్ట్రాలను అందుకోవడం కాదు, వారిని దాటి ముందుకు దూసుకుపోతోంది. సంస్కరణల్లో స్థిరత్వం, నిర్ణయాల్లో వేగం, పెట్టుబడిదారులకు స్పష్టమైన భరోసా ఇవ్వడం వల్లే ఈ ఫలితం సాధ్యమైందని తెలిపారు. మాటలకే పరిమితం కాకుండా, విధానాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also:

