రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో పూర్తిస్థాయి, శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పష్టం చేశారు.
శాసనసభలో దీనిపై మాట్లాడిన ఆయన, ఈ క్యాంపస్ల అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. నిధుల కోసం ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రితో చర్చలు జరిపామని లోకేశ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 'సాస్కీ' పథకం ద్వారా నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
Read Also: Andhra Pradesh: ద్వారకా తిరుమలలో కల్తీ నెయ్యి కలకం

ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న నాలుగు క్యాంపస్లకు అవసరమైన నిధుల వివరాలను మంత్రి సభకు తెలియజేశారు. నూజివీడు క్యాంపస్లో పనులు పూర్తి చేయడానికి రూ.60 కోట్లు, అరకు వ్యాలీలో నిర్మాణాలకు రూ.40 కోట్లు అవసరమని అంచనా వేశామన్నారు. అదేవిధంగా, ఒంగోలు (Ongole) క్యాంపస్కు రెండు దశల్లో కలిపి రూ.600 కోట్లు, శ్రీకాకుళం క్యాంపస్ పనులు పూర్తి చేయడానికి రూ.300 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని ఆయన (Nara Lokesh) పేర్కొన్నారు.
శాశ్వత భవనాలు లేకపోవడంతో విద్యార్థులు చదువు మధ్యలో తాత్కాలిక అకాడమీల కోసం వేర్వేరు జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఏ జిల్లాలో ట్రిపుల్ ఐటీ చదివే విద్యార్థులు అక్కడే తమ కోర్సును పూర్తి చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని లోకేశ్ స్పష్టం చేశారు. శాశ్వత సౌకర్యాలను ఏర్పాటు చేసి, విద్యార్థులు చేరిన క్యాంపస్లోనే చదువు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

