Nellore Gudur Teacher Attack: నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండల పరిధిలో సంచలనం రేపిన మహిళా ఉపాధ్యాయురాలి దోపిడీ కేసులో పోలీసులు మెరుపు వేగంతో స్పందించారు.
బాలాయపల్లిలో టీచర్గా పనిచేస్తున్న మహిళ, గూడూరు టౌన్లో ఆటో ఎక్కి వెళ్తుండగా.. చీమర్తి సమీపంలో ఆటో డ్రైవర్ ఆమెపై దాడి చేశాడు. ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశాడు.
నిందితుడిని ధైర్యంగా ఎదుర్కొన్న బాధితురాలు
ఈ దాడి సమయంలో బాధితురాలు ఏమాత్రం భయపడకుండా నిందితుడిని ధైర్యంగా ఎదుర్కొంది. దొంగతో పోరాడి అతడిని గాయపరిచింది. అయితే, ఈ పెనుగులాటలో ఆమెకు కూడా గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాలతో క్రైమ్ టీమ్స్ రంగంలోకి దిగాయి.
Nellore Gudur Teacher Attack: పోలీసుల మెరుపు ఆపరేషన్
ఎస్పీ నిరంతరం సమన్వయం చేస్తూ ఇచ్చిన సూచనలతో గూడూరు రూరల్ పోలీసులు గంటల వ్యవధిలోనే గాలింపు చర్యలు చేపట్టారు. దాడి జరిగిన మూడు గంటల్లోనే ముద్దాయిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడితో పాటు అతను వాడిన ఆటోను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఏఎస్పీ పరామర్శ.. కిమ్స్లో చికిత్స
ప్రస్తుతం బాధిత ఉపాధ్యాయురాలు నెల్లూరులోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఏఎస్పీ సౌజన్య గురువారం ఆసుపత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. నిందితుడిని విచారిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

