Farmer Registry:కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో డిజిటలైజేషన్ను వేగవంతం చేస్తూ సబ్సిడీ ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరిగేలా కొత్త వ్యవస్థను అమల్లోకి తెచ్చింది.
ఫార్మర్ రిజిస్ట్రీ లేదా అగ్రిస్టాక్ ఆధారిత గుర్తింపు వ్యవస్థ ద్వారా మాత్రమే యూరియా, డీఏపీ వంటి ఎరువులు బుక్ చేసుకోవాలని స్పష్టం చేసింది. లేకపోతే సబ్సిడీ రేటుపై ఎరువులు అందవని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాల్లో ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ ప్లాట్ఫామ్ పైలట్గా అమలవుతోంది. రైతులు తమ మొబైల్ యాప్ ద్వారా భూమి, పంట వివరాలు నమోదు చేసి ముందుగా ఎరువులు బుక్ చేసుకోవాలి. బుకింగ్ పూర్తయిన తర్వాత క్యూఆర్ కోడ్ టోకెన్ జారీ అవుతుంది. రిటైలర్లు పాయింట్-ఆఫ్-సేల్ మెషీన్లో దీన్ని స్కాన్ చేసి ఆధార్ బయోమెట్రిక్ పూర్తి చేసిన తర్వాత ఎరువులు అందిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది. నిజామాబాద్, కామారెడ్డి, కృష్ణా, కాకినాడ వంటి జిల్లాల్లో ఈ విధానాన్ని విస్తరించారు. ఈ సిస్టమ్ ద్వారా రియల్ టైమ్ స్టాక్ సమాచారం అందుతుంది. అక్రమాలు, నల్లబజారు దందాలు, స్టాక్ దాచడం వంటి సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టవచ్చు. ప్రతి రైతుకు ఆధార్, భూమి రికార్డులు, పంట వివరాలను లింక్ చేసి పదకొండు అంకెల యూనిక్ డిజిటల్ ఐడీ ఇస్తారు. ఈ ఐడీ ఉంటేనే పీఎం కిసాన్, పంటల బీమా, సబ్సిడీ విత్తనాలు సులభంగా అందుతాయి.
Read also: West Bengal : అనుమానాస్పద స్థితిలో TMC నేత మృతి
Subsidized fertilizers only for genuine farmers.
నమోదు చేసుకునే విధానం మరియు అవసరమైన పత్రాలు
ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియ పూర్తిగా ఉచితం మరియు చాలా సులభం. ఆంధ్రప్రదేశ్లో అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎంచుకుని ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో ధృవీకరించాలి. ఆ తర్వాత పేరు, పుట్టిన తేదీ, సర్వే నంబర్, ఖాతా నంబర్, భూమి విస్తీర్ణం నమోదు చేసి సబ్మిట్ చేయాలి. ఆఫ్లైన్లో రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయ అధికారుల ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. తెలంగాణలో రైతు వేదికలు, వ్యవసాయ విస్తరణాధికారులు, మీసేవా కేంద్రాల ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. నమోదు కోసం ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, ఆధార్ లింక్ మొబైల్ నంబర్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. భూమి రికార్డులు అప్డేట్గా ఉండాలి. కౌలు రైతులకు కూడా సరైన ధృవీకరణ పత్రాలతో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. నమోదు పూర్తయిన తర్వాత స్టేటస్ను పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు. ఎఫ్ఎఫ్ఎస్ యాప్లో లాగిన్ అయి సమీప డీలర్ను ఎంచుకుని స్టాక్ చూసి ఎరువులు బుక్ చేసుకోవసుకోవచ్చు. టోకెన్ తీసుకున్న తర్వాత డీలర్ దగ్గర క్యూఆర్ స్కాన్ చేసి ఎరువులు తీసుకోవాలి. దీనివల్ల క్యూ లైన్లలో నిలబడే శ్రమ తప్పుతుంది. సమయంతో పాటు ప్రయాణ ఖర్చులు కూడా పూర్తిగా ఆదా అవుతాయి.
Farmer Registry:ఈ కొత్త వ్యవస్థ వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు
ఈ డిజిటల్ విధానం వల్ల రైతులకు ఎన్నో లాభాలు ఉన్నాయి. మొదటిది బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలు పూర్తిగా తగ్గిపోతాయి. వ్యవసాయేతర అవసరాలకు ఎరువులను మళ్లించడం సాధ్యం కాదు. రెండవది భూమి విస్తీర్ణం, పంట రకం ఆధారంగా సరైన పరిమాణంలో ఎరువులు అందుతాయి. మూడవది పీఎం కిసాన్, సాయిల్ హెల్త్ కార్డ్, యంత్రాల సబ్సిడీ వంటి పథకాలు అప్రయత్నంగా లింక్ అవుతాయి. నాలుగవది రియల్ టైమ్ మానిటరింగ్ ఉండటం వల్ల ప్రభుత్వానికి సరఫరా డిమాండ్ అంచనా వేయడం సులభం అవుతుంది. ఐదవది రైతులు ఇంటి నుంచే మొబైల్ ద్వారా ఎరువులు బుక్ చేసుకునే సదువు ఉంటుంది. నెట్వర్క్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో మీసేవా కేంద్రాల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతి పథకం ఈ ఐడీకి అనుసంధానం అవుతుంది. కాబట్టి రైతులు వెంటనే సమీప వ్యవసాయ కార్యాలయానికి వెళ్లి నమోదు పూర్తి చేసుకోవాలి. ఆధార్ మొబైల్ నంబర్ సరిగ్గా లింక్ అయి ఉండేలా చూసుకోవాలి. వ్యవసాయ రంగాన్ని మరింత పారదర్శకంగా మార్చడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో సబ్సిడీ ఎరువులను పొందాలి.
Epaper: epaper.vaartha.com

