NEET UG Results: మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 'నీట్-యూజీ' (NEET-UG) రీ-టెస్ట్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. జులై 20వ తేదీ లోపు ఈ రీ-ఎగ్జామ్ ఫలితాలను ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పష్టం చేసింది.
గతంలో పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 3న జరిగిన పరీక్షను రద్దు చేసి, జూన్ 21న తిరిగి నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రిజల్ట్స్ ప్రాసెసింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, నిర్దిష్ట తేదీని త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని ఎన్టీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఫలితాలు ఆలస్యమైనప్పటికీ, ఎంబీబీఎస్ (MBBS) విద్యా సంవత్సరం ప్రారంభంలో ఎలాంటి ఆలస్యం ఉండబోదని ఆయన భరోసా ఇచ్చారు.

10 వేల అభ్యంతరాలు.. క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు
జూన్ 25న విడుదల చేసిన ప్రొవిజనల్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలియజేసేందుకు జూన్ 28 వరకు విద్యార్థులకు గడువు ఇచ్చారు. ఈ గడువులోగా దేశవ్యాప్తంగా సుమారు 10,000 అభ్యంతరాలు వచ్చినట్లు ఎన్టీఏ వెల్లడించింది. అభ్యర్థులు పంపిన ప్రతి అభ్యంతరాన్ని, దానికి సంబంధించిన ఆధారాలను నిపుణుల కమిటీ విడివిడిగా పరిశీలిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఒక్కో ప్రశ్నకు రూ.200 చొప్పున ఫీజు వసూలు చేశామని, విద్యార్థులు లేవనెత్తిన అభ్యంతరం సరైనదేనని తేలితే ఆ మొత్తాన్ని తిరిగి రిఫండ్ (Refund) చేస్తామని స్పష్టం చేశారు.
NEET UG Results: ఫలితాల తర్వాతే కౌన్సెలింగ్ ప్రక్రియ
ఫలితాలు విడుదలైన వెంటనే మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) రంగంలోకి దిగనుంది. 15 శాతం ఆల్ ఇండియా కోటాతో పాటు ఎయిమ్స్ (AIIMS), జిప్మర్ (JIPMER), సెంట్రల్, డీమ్డ్ యూనివర్సిటీల సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఎంసీసీ విడుదల చేస్తుంది. అదేవిధంగా, మిగిలిన 85 శాతం స్టేట్ కోటా సీట్ల కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపడతాయి. కౌన్సెలింగ్ ముగిసిన వెంటనే గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం క్లాసులు అనుకున్న సమయానికే ప్రారంభమవుతాయని ఎన్టీఏ స్పష్టం చేసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
గర్భవతులకు అమెరికాలో చోటు లేదా? కోర్టులో ఎదురుదెబ్బ తర్వాత ట్రంప్ 'ప్లాన్ బి'

