Rare Monkeys : ఒడిశాలోని బాలాసోర్ జిల్లా అడవుల్లో ఐదు అరుదైన ఒరంగుటాన్లు కనిపించడం తీవ్ర సంచలనంగా మారింది. స్థానికులు భోగ్రాయ్ ప్రాంతంలోని బడపై గ్రామం సమీపంలో చెట్లపై ఈ వానరాలను గుర్తించారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే అక్కడికి Rare Monkeys చేరుకుని ఐదు జంతువులను రక్షించారు. వాటిలో నాలుగు ఆరోగ్యంగా ఉన్నాయని, పశువైద్య నిపుణులు వాటికి పరీక్షలు, చికిత్స అందిస్తున్నారని అధికారులు తెలిపారు.
ఇండోనేషియా, మలేషియా ప్రాంతాల్లోని :
ఒరంగుటాన్లు భారతదేశంలోని అడవుల్లో సహజంగా కనిపించే జంతువులు కావు. ఇవి ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా ప్రాంతాల్లోని ఉష్ణమండల అటవీ ప్రాంతాల్లో జీవిస్తాయి. అందువల్ల బాలాసోర్ అడవుల్లో ఒకేసారి ఐదు ఒరంగుటాన్లు కనిపించడం అటవీశాఖ అధికారులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. వాటి సహజ ఆవాసాలకు ఒడిశా దాదాపు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ జంతువులు ఒడిశాకు ఎలా చేరుకున్నాయన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. అంతర్జాతీయ వన్యప్రాణుల అక్రమ రవాణా ముఠాలకు సంబంధించిన వ్యవహారం కావచ్చన్న అనుమానంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. జంతువులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు తరలించారు, అడవిలోకి ఎలా చేరాయి అనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న వ్యక్తులు లేదా నెట్వర్క్ను గుర్తించేందుకు అటవీశాఖ ప్రత్యేకంగా పరిశీలన చేపట్టింది.
భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరడంతో అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని ఒరంగుటాన్లను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వాటి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించిన అనంతరం తదుపరి సంరక్షణ కోసం నందన్కానన్ జూలాజికల్ పార్క్ కు తరలించే అవకాశం ఉందని సమాచారం. అరుదైన, అంతరించిపోతున్న జాతులకు చెందిన జంతువులను అక్రమంగా తరలించడం వాటి ప్రాణాలకు తీవ్ర ముప్పుగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాలాసోర్ ఘటన అంతర్జాతీయ వన్యప్రాణుల అక్రమ రవాణాపై మరోసారి దృష్టిని మళ్లించింది.

