(Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల వేళ అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. రేపటి మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక, ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
కూటమి ప్రభుత్వానికి చెందిన మహిళా మంత్రులు, శాసనసభ్యులు భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తూ ఒకే రకమైన వస్త్రధారణతో సభకు హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు.

మహా శివరాత్రి(Maha Shivaratri) పర్వదినం సమీపిస్తున్న సందర్భంగా, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి సహా పలువురు మహిళా ప్రజాప్రతినిధులు శివతత్వానికి ప్రతీకగా నిలిచే ప్రత్యేకమైన చీరలను ధరించి అసెంబ్లీకి వచ్చారు. శాసనసభ ప్రాంగణం వారి రాకతో కళకళలాడింది. మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి, ఎస్. సవితతో పాటు ఇతర మహిళా ఎమ్మెల్యేలు సైతం ఈ ప్రత్యేక డ్రెస్ కోడ్ను పాటించారు. ఒకే రంగు, ఒకే తరహా వస్త్రధారణతో కనిపించిన వారి ఐక్యత సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అనంతరం మహిళా ప్రజాప్రతినిధుల బృందం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను (Pawan Kalyan) మర్యాదపూర్వకంగా కలిసింది. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రదర్శించిన ఉత్సాహం, ఐక్యతను ఆయన అభినందించారు. సభలో సంస్కృతి, సంప్రదాయాల స్ఫూర్తిని ప్రతిబింబించిన తీరు ప్రశంసనీయమని తెలిపారు. మహిళా శక్తి, సంఘటిత భావనకు ఇది మంచి ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com

