Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
PGRSలో 69 ఫిర్యాదులు స్వీకరణ

PGRSలో 69 ఫిర్యాదులు స్వీకరణ

వార్త 5 days ago

Nellore PGRS Grievance: జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలతో వచ్చే బాధితుల అర్జీలను సత్వరమే పరిష్కరించడంతో పాటు ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా విచారించి బాధితులకు చట్టపరమైన న్యాయం చేయాలని నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.

ఒకసారి స్వీకరించిన ప్రజా వినతులు పరిష్కారం కాక మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా క్షేత్రస్థాయి అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. సోమవారం నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సిహెచ్. సౌజన్య తదితర పోలీస్ ఉన్నతాధికారుల సమక్షంలో నిర్వహించిన "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS – Public Grievance Redressal System)" కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి మొత్తం 69 ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సౌజన్య మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజా ఫిర్యాదుల పట్ల ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదన్నారు. బాధితులతో మర్యాదపూర్వకంగా, జవాబుదారీతనంతో వ్యవహరించాలని, ప్రతి పిటిషన్‌ను సమగ్రంగా విచారించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

అనుమానాస్పద మృతి, బాలిక అదృశ్యంపై ప్రత్యేక ఫోకస్

ఈరోజు జరిగిన ఈ గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో పలు సంచలన ఫిర్యాదులు వచ్చాయి. విడవలూరు పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడు ఫిర్యాదు చేస్తూ.. ఇటీవల తన తల్లి అనుమానాస్పద స్థితిలో మరణించిందని, ఈ విషయమై ఇప్పటికే విడవలూరు పోలీస్ స్టేషన్‌లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైనట్లు తెలిపారు. ఈ కేసును లోతుగా విచారించి తన తల్లి మరణానికి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మరో ఫిర్యాదుదారుడు స్పందిస్తూ.. తన మైనర్ కుమార్తె ఈనెల 14వ తేదీ నుండి కనిపించడం లేదని, బుచ్చి స్టేషన్‌లో కేసు నమోదైనప్పటికీ ఇప్పటివరకు ఆచూకీ లభించలేదని, త్వరితగతిన విచారించి తన కుమార్తెను అప్పగించి న్యాయం చేయాలని కన్నీరు మున్నీరయ్యారు.

కోవూరు పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక వివాహిత ఫిర్యాదు చేస్తూ.. అదనపు కట్నం కోసం తన భర్త, అత్తమామలు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, ఈ గృహ హింసపై విచారణ జరిపి తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని అర్జీ సమర్పించారు.

Nellore PGRS Grievance: బాధితులకు భరోసా - నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ఈ మూడు కీలక ఫిర్యాదులతో పాటు వచ్చిన అన్ని అర్జీలను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ Ch. సౌజన్య.. సంబంధిత విడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లతో ఫోన్లలో మాట్లాడి తక్షణమే దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) నందు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై చట్టపరంగా నిష్పక్షపాత విచారణ జరిపి బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని, మహిళలు, మైనర్ల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైతే స్పెషల్ టీమ్స్ రంగంలోకి దించుతామన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ సమగ్ర వినతుల స్వీకరణ కార్యక్రమంలో డీసీఆర్‌బీ (DCRB) సీఐ రామారావు, ఉమెన్ పోలీస్ స్టేషన్ (WPS) సీఐ సుబ్బారావు, స్పెషల్ బ్రాంచ్ (SB-2) సీఐ శ్రీనివాసులు రెడ్డి, గ్రీవెన్స్ సెల్ పోలీస్ సిబ్బంది మరియు జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు పాల్గొన్నారు.

జూలై 1న హీరో మోటోకార్ప్ జీపీసీ 2.0 కి శంకుస్థాపన చేయనున్న సీఎం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha