Kannepalli Pump House : కాళేశ్వరం ప్రాజెక్టును వేదికగా చేసుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య సాగుతున్న రాజకీయ యుద్ధంపై భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ భేషజాలకు పోకుండా, తక్షణమే కన్నెపల్లి పంప్ హౌస్ (లక్ష్మి పంప్ హౌస్) మోటార్లను ఆన్ చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య జరుగుతున్న పరస్పర విమర్శలను, రాజకీయ లెక్చర్లను తాము గమనిస్తున్నామని అన్నారు. ప్రాజెక్టులోని లోపాలను సాకుగా చూపిస్తూ నీటిని సముద్రం పాలు చేయడం సరికాదని హితవు పలికారు.

‘దోషులను శిక్షించండి.. కానీ ప్రజలను కాదు!’: పంప్ హౌస్ నిర్వహణపై స్పష్టత
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీలో నీళ్లు నిల్వ ఉంచలేని పరిస్థితి ఉండటం ముమ్మాటికీ వాస్తవమేనని ఈటల రాజేందర్ అంగీకరించారు. అయితే, బ్యారేజీ దెబ్బతిన్నప్పటికీ కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను ఆపరేట్ చేసి గోదావరి వరద నీటిని ఎత్తిపోయడానికి సాంకేతికంగా ఎలాంటి అడ్డంకులు లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన.. “రేవంత్ గారూ.. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించండి, తప్పు చేసిన దోషులను కఠినంగా శిక్షించండి. కానీ ఆ పంతంతో పంప్ హౌస్ మోటార్లు ఆపి రైతులను, ప్రజలను మాత్రం శిక్షించకండి” అని హితవు పలికారు. వేలాది కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఈ మౌలిక వసతులను కక్షసాధింపు రాజకీయాల కోసం వృథా చేయకుండా, తక్షణమే పంపింగ్ ప్రారంభించి ఎండకట్టే పొలాలను ఆదుకోవాలని ఈటల డిమాండ్ చేశారు.

