Bharathi raja: భారతీయ చలనచిత్ర రంగానికి, ముఖ్యంగా దక్షిణాది సినిమాకు గ్రామీణ నైపథ్య కథలతో సరికొత్త రూపురేఖలు దిద్దిన అద్భుత దర్శకుడు, నటుడు భారతీరాజా (84) మరణించారు.
గత కొంతకాలంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన, చెన్నైలోని తన స్వగృహంలో బుధవారం కన్నుమూశారు. ఆయన హఠాన్మరణంతో కోలీవుడ్తో పాటు టాలీవుడ్ మరియు యావత్ భారత చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
పుత్రశోకం.. ఆపై క్షీణించిన ఆరోగ్యం
భారతీరాజా వ్యక్తిగత జీవితంలో గతేడాది మార్చి 2025లో పెద్ద విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమారుడు, నటుడైన మనోజ్ భారతీరాజా (48) గుండెపోటుతో అకస్మికంగా మరణించారు. ఈ పుత్రశోకం వృద్ధాప్యంలో ఉన్న భారతీరాజాను మానసికంగా తీవ్రంగా కుంగదీసింది. అప్పటి నుంచి ఆయన శ్వాసకోశ ఇబ్బందులతో పాటు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఈ ఏడాది ఆరంభం నుండి పలుమార్లు ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆయన ఈ లోకాన్ని విడిచివెళ్లారు.
Read also: The Empty Address movie: 'ది ఎంప్టీ అడ్రస్' మూవీతో షఫీక్ ఉర్ రెహమాన్ హాలీవుడ్ ఎంట్రీ
Bharathi raja: ‘చిన్నసామి’ టు ‘మిరాకిల్ డైరెక్టర్’.. సినిమా గమనాన్ని మార్చిన ప్రస్థానం
1941 జూలై 17న తమిళనాడులోని తేని సమీపంలో ఉన్న అల్లినగరంలో జన్మించిన భారతీరాజా అసలు పేరు చిన్నసామి. సినిమాపై ఉన్న మక్కువతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన, 1977లో శ్రీదేవి, రజినీకాంత్, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ’16 వయతినిలే’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. పల్లెటూరి జీవన విధానాన్ని అత్యంత సహజంగా చూపించిన ఈ సినిమా నాటి తమిళ సినిమా మేకింగ్ స్టైల్నే మార్చేసింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘పదహారేళ్ల వయసు’ పేరుతో రీమేక్ చేయగా ఇక్కడా బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది.
తెలుగు సినిమాలతో విడదీయరాని బంధం
తన ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో భారతీరాజా దాదాపు 40 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. కుల వివక్ష, సామాజిక సమస్యలు, పల్లెటూరి మానవ సంబంధాల నైపథ్యంలో ఆయన రూపొందించిన కిళక్కే పోగుమ్ రైల్, సిగప్పు రోజాక్కళ్, ముదల్ మరియాదై, వేదం పుదిదు వంటి చిత్రాలు క్లాసిక్స్గా నిలిచాయి. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’, ‘ఆరాధన’, ‘జమదగ్ని’ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.
దర్శకుడిగానే కాకుండా నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రం ‘మంగమ్మ గారి మనవడు’ చిత్రానికి కథను, ‘పల్నాటి పౌరుషం’ సినిమాకు స్క్రీన్ ప్లేను అందించింది కూడా భారతీరాజానే కావడం విశేషం. పరిశ్రమకు కార్తీక్, రేవతి లాంటి ఎందరో ప్రతిభావంతులైన నటీనటులను ఆయన పరిచయం చేశారు.
పురస్కారాల ఘనత.. ప్రముఖుల సంతాపం
సినిమా రంగానికి భారతీరాజా చేసిన అసమాన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2004లో ఆయనను ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. దీంతో పాటు ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు ఆయనను వరించాయి. ఆయన దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ చిత్రానికి జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్ర అవార్డుతో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారం లభించింది. సినీ అభిమానులచే ‘మిరాకిల్ డైరెక్టర్’ అని పిలవబడే భారతీరాజా మృతి పట్ల దౌతృ, రాజకీయ మరియు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also:

