Indian Railways: రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ సరికొత్త శుభవార్త చెప్పింది. రైలు టికెట్ల బుకింగ్ విధానంలో గత కొన్ని దశాబ్దాలుగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న సర్వర్ సమస్యలు, ఆలస్యానికి శాశ్వతంగా చెక్ పెట్టేందుకు సిద్ధమైంది.
ఇందులో భాగంగా ఈ ఏడాది ఆగస్టు నుంచి సరికొత్త 'ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్' విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. దాదాపు 1986 నుంచి అంటే నాలుగు దశాబ్దాలుగా వాడుకలో ఉన్న పాత సాంకేతిక విధానాన్ని పక్కనబెట్టి, ఈ సరికొత్త అత్యాధునిక వ్యవస్థను రైల్వే ప్రవేశపెడుతోంది.
Read also: Alliance of India : కొనసాగుతున్న ఇండియా కూటమి సమావేశం
Good news for passengers.. New change in railway ticket booking from August
Indian Railways: మరింత వేగంగా ఆన్లైన్ బుకింగ్స్
ఈ సరికొత్త సాంకేతిక అప్గ్రేడ్ వల్ల ఆన్లైన్ టికెట్ బుకింగ్ సామర్థ్యం ఊహించని స్థాయిలో పెరగనుంది. దీనివల్ల తత్కాల్ సమయాల్లో లేదా పీక్ అవర్స్లో నిమిషాల వ్యవధిలోనే లక్షలాది టికెట్లను ఎలాంటి సర్వర్ లోపాలు (Server Crashes) లేకుండా ప్రయాణికులు అత్యంత వేగంగా బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త సిస్టమ్కు మారే ప్రక్రియపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలోని రైల్ భవన్లో ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సాంకేతిక మార్పులు జరుగుతున్న సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగరాదని ఆయన అధికారులను ఆదేశించారు.
88 శాతం ఆన్లైన్ బుకింగ్సే!
రైల్వే శాఖ 2002 సంవత్సరంలో మొదటిసారిగా ఇంటర్నెట్ ఆధారిత టికెట్ బుకింగ్ను ప్రారంభించింది. అప్పటి నుంచి రైల్వే కౌంటర్ల కంటే ఆన్లైన్లో బుక్ చేసుకునేవారి సంఖ్య ఏటా పెరుగుతూనే వస్తోంది. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న మొత్తం రైల్వే టికెట్లలో దాదాపు 88 శాతం బుకింగ్స్ కేవలం డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారానే జరుగుతుండటం విశేషం. ఈ భారీ డిమాండ్ను తట్టుకుని, ప్రయాణికులకు సులభమైన సేవలు అందించడానికే రైల్వే శాఖ పాత వ్యవస్థను అధునాతన సాంకేతికతతో మారుస్తోంది.
రైల్వే శాఖ డిజిటల్ విప్లవంలో భాగంగా గతేడాది జులైలో ప్రారంభించిన 'రైల్ వన్' (Rail One) మొబైల్ యాప్ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం ఏడాది లోపే ఈ యాప్ ఏకంగా 3.5 కోట్ల డౌన్లోడ్లను దాటేసింది. ఈ ఒక్క యాప్ ద్వారానే టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, రైలు లైవ్ స్టేటస్, ప్లాట్ఫామ్ సమాచారం మరియు ఫిర్యాదులను నమోదు చేసే సదుపాయం ఉంది. ప్రస్తుతం ఈ యాప్ ద్వారా ప్రతిరోజూ సుమారు 9.29 లక్షల టికెట్లు బుక్ అవుతున్నాయని రైల్వే శాఖ వెల్లడించింది.
94% కచ్చితత్వంతో ఏఐ (AI) వెయిటింగ్ లిస్ట్ ప్రిడిక్షన్!
కొత్త సిస్టమ్తో పాటు ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వెయిటింగ్ లిస్ట్ టూల్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. మనం బుక్ చేసుకున్న వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అనే అవకాశాలను ఈ ఏఐ టూల్ ముందుగానే అంచనా వేస్తుంది. గతంలో దీని అంచనా కచ్చితత్వం 53 శాతంగా ఉండగా.. ఇప్పుడు సాంకేతికతను మెరుగుపరచడంతో ఏకంగా 94 శాతానికి పెరిగింది. దీనివల్ల ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మరింత సులభంగా మార్చుకునే వీలుంటుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:
ఢిల్లీ ఎయిర్పోర్టులో ప్రమాదం.. మూడు ఎయిర్ ఇండియా విమానాలు ధ్వంసం!

