Cockroach Janata Party: పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CGP) ఇప్పుడు తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే నివాసంలో సుమారు ఏడు గంటల పాటు సుదీర్ఘ వ్యూహాత్మక భేటీ నిర్వహించారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను తమ తొలి విజయంగా భావిస్తున్న ఈ సంస్థ, ఇదే జోరును కొనసాగించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విద్యార్థి సంఘాలను ఒకే తాటిపైకి తెచ్చి, ఇతర రాష్ట్రాల్లో జరిగే విద్యార్థి ఆందోళనలకు పూర్తి మద్దతునివ్వాలని ఈ సమావేశంలో తీర్మానించారు.
రాజకీయ పార్టీగా మారే ప్రసక్తే లేదు
తమ సంస్థ రాజకీయాల్లోకి ప్రవేశిస్తుందనే వార్తలను సీజేపీ నాయకత్వం ఖండించింది. తాము ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించడం లేదని, కేవలం ఒక ‘ప్రెజర్ గ్రూప్’ (ఒత్తిడి బృందం) గానే ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని అభిజిత్ దిప్కే స్పష్టం చేశారు. రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం తగ్గిన నేపథ్యంలో, తాము కేవలం సంస్కరణల సాధనే ధ్యేయంగా పనిచేస్తామని వెల్లడించారు.
Cockroach Janata Party: కేవలం విద్యారంగ సమస్యలపైనే దృష్టి
ఇతర రాజకీయ లేదా సామాజిక విషయాలతో సంబంధం లేకుండా, కేవలం విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడమే తమ ప్రధాన అజెండా అని సీజేపీ తేల్చిచెప్పింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యతాయుతమైన విధానాలు, మరియు విద్యార్థుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా దేశవ్యాప్త ఉద్యమాన్ని ఉద్ధృతం చేయనున్నారు. ఈ జాతీయ విస్తరణకు సంబంధించిన విధివిధానాలు, కీలక బాధ్యతల కేటాయింపు త్వరలోనే అధికారికంగా వెల్లడికానుంది.

