Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని స్థాపన అంశంపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
గత ఐదేళ్ల పాటు అమరావతిని కాదని, వికేంద్రీకరణే ధ్యేయంగా ‘మూడు రాజధానుల’ (విశాఖపట్నం, అమరావతి, కర్నూలు) నినాదంతో ముందుకు సాగి, అదే ఎజెండాతో ఎన్నికలకు వెళ్లిన ఆ పార్టీ ఓటమి తర్వాత తన వ్యూహాన్ని మార్చింది. ఇటీవల మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల కలయికగా ‘మావిగన్’ (MAVIGAN) సరికొత్త రాజధాని ప్రతిపాదనను జగన్ తెరపైకి తెచ్చారు. అయితే, నిన్నటి వరకు ‘మావిగన్’ నినాదంతోనే ముందుకు వెళ్తామని చెప్పిన జగన్, తాజాగా ‘విజయవాడే ఆంధ్రప్రదేశ్ రాజధాని’ అంటూ సంచలన ప్రకటన చేయడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈ వరుస మార్పులతో అసలు రాజధాని విషయంలో వైసిపి అంతర్గత వ్యూహం ఏంటనే దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
YS Jaganగందరగోళంలో వైసిపి శ్రేణులు – బొత్స వివరణపై రాజకీయ దుమారం
రాజధాని మార్పులపై అధినేత జగన్ ఒకదాని తర్వాత ఒకటిగా మారుస్తున్న ప్రకటనలతో సొంత పార్టీ నేతలు, శ్రేణులే తీవ్ర గందరగోళంలో పడ్డారు. దీనిపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. జగన్ పేర్కొన్న ‘మావిగన్’ లేదా విజయవాడ ప్రతిపాదనలు పార్టీ అధికారిక నిర్ణయం కాదని, ప్రస్తుత ప్రభుత్వానికి తాము ఇస్తున్న ఒక సూచన (Suggestion) మాత్రమేనని సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, మూడు రాజధానుల ముచ్చటను వదిలేసి, ఇప్పుడు కృష్ణా-గుంటూరు జిల్లాల వైపు జగన్ మొగ్గు చూపడం వెనుక భవిష్యత్తు రాజకీయ సమీకరణాలు దాగి ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజధానిపై స్పష్టమైన ఏకాభిప్రాయం లేకపోవడం, రోజుకో మాట మారుస్తుండటంతో అధికార పక్షం కూటమి నేతలు వైసీపీ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నారు.
ఏపీలోని రైల్వే కోడూరు నుంచి 'వీబీ జీ రామ్ జీ' జాతీయ పథకం ప్రారంభం

