Ayodhya Ram Mandir: దేశవ్యాప్తంగా కోట్ల మంది హిందువుల ఆరాధ్యదైవమైన అయోధ్య రామయ్య ఆలయం ఇప్పుడు విరాళాల వివాదంతో వార్తల్లో నిలిచింది. ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న తరుణంలో..
రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా చేసిన సంచలన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి.
Ayodhya Ram Mandir
ఆలయ అడ్మినిస్ట్రేషన్ (నిర్వహణ) వ్యవస్థలో స్పష్టమైన లోపాలు ఉన్నాయని, మొత్తం యంత్రాంగాన్ని సమూలంగా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ 'ఇండియా టుడే'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆలయ అంతర్గత వ్యవహారాలపై కుండబద్దలు కొట్టారు. అనుభవజ్ఞులైన నిపుణుల పర్యవేక్షణలోనే ఈ పనులు సాగాలని ఆయన సూచించారు.
Read also: Yogi Adityanath : అయోధ్య రామమందిరం విరాళాల స్కాంపై సీఎం యోగి వార్నింగ్
‘సిట్’ దర్యాప్తుతో వెలుగులోకి.. ట్రస్ట్ ఖండన!
ఇటీవల అయోధ్య ఆలయ విరాళాల లెక్కింపులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు రావడమే కాకుండా, ఒక ఆలయ ఉద్యోగి నివాసం నుంచి పెద్ద ఎత్తున నగదు పట్టుబడటం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) రంగంలోకి దించింది. ప్రస్తుతం ఈ ‘సిట్’ అధికారులు విరాళాల రిజిస్టర్లు, సెక్యూరిటీ రికార్డులతో పాటు ఆలయ సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా, 'శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్' మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చింది. తమ అకౌంట్లు అన్నీ పక్కాగా ఉన్నాయని, ఎలాంటి తప్పులు జరగలేదని స్పష్టం చేసింది.
Ayodhya Ram Mandir: నిబంధనలు ఉన్నాయి.. కానీ అమలు కాలేదు!
ఈ వివాదం తనను మానసికంగా ఎంతో కలచివేసిందని నృపేంద్ర మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ పనులు ముగింపు దశకు వచ్చిన తరుణంలో ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరమన్నారు. ప్రస్తుతం ఆలయంలో దాదాపు 1,500 మంది స్వచ్ఛంద సేవకులు వివిధ రకాల సేవలు అందిస్తున్నారని, అయితే ఎవరి బాధ్యతలు ఏమిటనే దానిపై రాతపూర్వక ఆదేశాలు కానీ, క్రమబద్ధమైన విధివిధానాలు కానీ లేకపోవడం పెద్ద మైనస్ అని చెప్పారు.
2023 నుంచి 2025 మధ్య విరాళాల సేకరణపై జారీ చేసిన మార్గదర్శకాలను తాను పరిశీలించానని.. విరాళాలు లెక్కించే గదిలోకి వెళ్లే సిబ్బంది డ్రెస్ కోడ్ నుంచి, లోపలికి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు జరిగే బాడీ స్క్రీనింగ్ తనిఖీల వరకు ఎన్నో రూల్స్ ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. కానీ, ఆ నిబంధనలు క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కాలేదనే సమాచారం తనకు అందిందని మిశ్రా పేర్కొన్నారు. భక్తులు కేవలం డబ్బులే కాకుండా బంగారం, వెండి వంటి విలువైన కానుకలు కూడా ఇస్తుంటారని.. అందువల్ల ఈ విలువైన లోహాల లెక్కింపులోనూ లోపాలు జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
పర్యవేక్షణ లోపించింది.. కఠిన చర్యలు అవసరం
అసలు సమస్య కేవలం లెక్కల దగ్గరే ఆగిపోలేదని, పర్యవేక్షించే వ్యవస్థ కూడా బలహీనంగా తయారైందని మిశ్రా విమర్శించారు. నిబంధనల ప్రకారం బ్యాంకు ప్రతినిధులు, ట్రస్ట్ సభ్యులు సమక్షంలోనే అంతా జరగాల్సి ఉండగా.. అది సక్రమంగా సాగలేదన్నారు. విరాళాలు లెక్కించిన తర్వాత వాటిని బ్యాంకులకు తరలించే ప్రక్రియలో కూడా తగినంత నిఘా లేదని భావిస్తున్నారు. నిజాయతీతో పాటు కఠినమైన నిఘా ఉండాల్సిన చోట ఈ రెండు కరువయ్యాయని నృపేంద్ర మిశ్రా స్పష్టం చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Read also Epaper : epaper.vaartha.com
Read also:
పరీక్షల లోపాలతో బలవన్మరణాలు: బాధితులకు రూ. 1 కోటి పరిహారం ఇవ్వాలని ప్రధానికి లేఖ

