IRCTC : రైలు ప్రయాణాల్లో నిర్ణయించిన ఉచిత పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు ఇప్పటి వరకు ప్రయాణికులు తప్పనిసరిగా రైల్వే పార్సిల్ కార్యాలయానికి వెళ్లి అదనపు లగేజీని బుక్ చేసుకోవాల్సి వచ్చేది.
దీంతో సమయం వృథా కావడంతో పాటు ప్రయాణానికి ముందు ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యకు పరిష్కారంగా భారతీయ రైల్వే శాఖ (IRCTC) కొత్త ఆన్లైన్ అదనపు లగేజీ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే :
ఈ కొత్త విధానం ద్వారా ప్రయాణికులు రైలు టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే అవసరమైతే అదనపు లగేజీని కూడా ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పార్సిల్ కార్యాలయానికి ప్రత్యేకంగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రయాణికులు తమ లగేజీ వివరాలను నమోదు చేసి, నిర్ణయించిన ఛార్జీలను ఆన్లైన్లోనే చెల్లించవచ్చు.

అయితే ఈ సదుపాయం ప్రస్తుతం అన్ని రకాల కోచ్లకు వర్తించదు. ఏసీ 3-టైర్ (AC 3 Tier), చైర్ కార్ (Chair Car) ప్రయాణికులకు ఈ అవకాశం అందుబాటులో ఉండదు. మిగతా కేటగిరీల్లో ప్రయాణించే వారికి మాత్రమే ఈ సేవను అందిస్తున్నారు. రైల్వే నిబంధనల ప్రకారం ప్రతి తరగతికి ఉచిత లగేజీ పరిమితి వేర్వేరుగా ఉంటుంది. ఆ పరిమితిని మించిన బరువుకు మాత్రమే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ విధానం వల్ల ప్రయాణికులకు సమయం ఆదా కావడంతో పాటు బుకింగ్ ప్రక్రియ మరింత పారదర్శకంగా, సులభంగా మారనుంది. ముఖ్యంగా కుటుంబాలతో లేదా ఎక్కువ సామానుతో ప్రయాణించే వారికి ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడుతుంది. చివరి నిమిషంలో పార్సిల్ కార్యాలయం వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకునే వీలుంటుంది.
డిజిటల్ సేవలను విస్తరిస్తున్న భారతీయ రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ నిర్ణయం రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనుంది. అయితే ప్రయాణికులు అదనపు లగేజీ బుక్ చేసుకునే ముందు రైల్వే నిర్ణయించిన నిబంధనలు, బరువు పరిమితులు, వర్తించే ఛార్జీలను తప్పనిసరిగా పరిశీలించడం మంచిది.

