Rythu Bharosa : తెలంగాణలో రైతుభరోసా పథకం అమలుపై వస్తున్న పలు అంచనాలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్లోని శిల్పకళావేదికలో జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ..
‘రైతుభరోసా’ అంటే పంట సాగు చేసే రైతులకు ఇచ్చే భరోసా (పంట భరోసా) మాత్రమేనని, కేవలం భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ ఇచ్చే ‘భూమి భరోసా’ కాదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కేవలం పొలాల్లో నిజంగా పంటలు వేసిన అర్హులైన రైతులకే ఈ నిధులను జమ చేస్తామని ఆయన తేల్చి చెప్పారు. సాగు చేయకుండా ఖాళీగా ఉంచే భూములకు, రియల్ ఎస్టేట్ స్థలాలకు ఈ పథకాన్ని వర్తింపజేసే ప్రసక్తే లేదని ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన స్పష్టమైన సంకేతాలు పంపారు.

నిధుల సర్దుబాటు.. మద్దతు ధరకు పంటల కొనుగోలు!
గత యాసంగి సీజన్కు సంబంధించిన రైతుభరోసా ఆఖరి కిస్తీని రైతులకు జమ చేయలేకపోయిన మాట వాస్తవమేనని మంత్రి తుమ్మల బహిరంగంగానే అంగీకరించారు. అయితే, ఆ నిధులను ప్రభుత్వం వృథా చేయలేదని, దానికి బదులుగా ఏకంగా రూ. 5,000 కోట్లను కేటాయించి రైతన్నలు పండించిన ప్రతి గింజనూ మద్దతు ధర (MSP) ఇచ్చి కొనుగోలు చేశామని ఆయన వివరించారు. ఈ విధంగా రైతులకు ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లించేలా నిధులను సక్రమంగా నిర్వహించామని పేర్కొన్నారు. త్వరలోనే రైతుభరోసాకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను విడుదల చేసి, అర్హులైన నిజమైన సాగుదారులకు మేలు చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
గద్వాల జిల్లాలో 73 అంగన్వాడీ పోస్టులు.. వెంటనే అప్లై చేసుకోండి!

