Bejjanki Farmers Protest: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ లోపించిందో లేక సిబ్బంది కావాలనే కక్కుర్తి పడుతున్నారో కానీ, అన్నదాతలు మాత్రం నిలువునా మోసపోతున్నారు.
బెజ్జంకి మండలం రేగులపల్లి రాజీవ్ రహదారిపై శుక్రవారం రైతులు నిర్వహించిన నిరసన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని, అక్రమ తూకాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరారు.
బస్తాకు 6 కిలోల ‘దోపిడీ’!
గ్రామానికి చెందిన కుమ్మరి శ్రవణ్ అనే రైతు వద్ద ధాన్యం తూకం వేస్తున్న క్రమంలో అసలు విషయం బయటపడింది. నిబంధనల ప్రకారం బస్తాకు 41 కిలోల తూకం వేయాల్సి ఉండగా, నిర్వాహకులు ఏకంగా ప్రతి బస్తాకు 6 కిలోల చొప్పున అదనంగా తూకం వేయడాన్ని రైతులు గమనించారు. చెమటోడ్చి పండించిన ధాన్యంలో ఇంత దారుణంగా దోపిడీకి పాల్పడుతుండటంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రైతులను నిలువునా ముంచుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ 100 మందికి పైగా రైతులు రోడ్డుపై బైఠాయించారు.
Bejjanki Farmers Protest: స్తంభించిన రాజీవ్ రహదారి
రైతుల ఆందోళనతో అత్యంత రద్దీగా ఉండే రాజీవ్ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి తన సిబ్బందితో కలిసి వెంటనే రేగులపల్లికి చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన రైతులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.
మరోసారి జరిగితే కఠిన చర్యలు: ఎస్సై భరోసా
రైతుల గోడును విన్న ఎస్సై, తూకంలో మోసాలకు పాల్పడే వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని భరోసా ఇవ్వడంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఈ నిరసన కార్యక్రమంలో రేగులపల్లి గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

