India-Russia : భారత్ రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను మరోసారి రికార్డు స్థాయికి పెంచింది. 2026 జూలైలో భారత రిఫైనరీలు రోజుకు సుమారు 2.8 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ క్రూడ్ ను దిగుమతి చేసుకున్నాయి.
ఇది వరుసగా రెండో నెలలో నమోదైన రికార్డు. మొత్తం భారత క్రూడ్ దిగుమతుల్లో రష్యా వాటా సుమారు 55 శాతానికి పైగా చేరినట్లు తాజా పరిశ్రమ డేటా వెల్లడించింది.
రష్యా వాటా 50-52 శాతానికి :
జూన్లోనూ రష్యా నుంచి భారత్ రోజుకు సుమారు 2.64-2.6 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకుంది. అప్పట్లో మొత్తం దిగుమతుల్లో రష్యా వాటా 50-52 శాతానికి చేరింది. దీంతో భారత్ చరిత్రలో తొలిసారిగా ఒకే దేశం నుంచి వచ్చే క్రూడ్ వాటా సగానికి మించింది.

ఈ పెరుగుదలకు ప్రధాన కారణం రష్యన్ ఉరల్స్ క్రూడ్పై లభిస్తున్న ధర తగ్గింపు. ఇతర సరఫరాదారులతో పోలిస్తే రష్యా చమురు భారత రిఫైనరీలకు ఆకర్షణీయంగా ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ రిఫైనర్లు భారీగా కొనుగోళ్లు చేస్తున్నారు. అదే సమయంలో మధ్యప్రాచ్యంలో సరఫరా అంతరాయాలు, హార్ముజ్ జలసంధి చుట్టూ ఏర్పడిన అనిశ్చితి కూడా రష్యా చమురుపై భారత ఆధారపడటాన్ని పెంచింది.
అయితే ఈ పరిణామం అమెరికా ఒత్తిడిని కూడా పెంచుతోంది. రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షలు, సుంకాల బెదిరింపులు ఉన్నప్పటికీ, భారత్ తన ఇంధన భద్రత, తక్కువ దిగుమతి వ్యయంకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇక ముందూ రష్యా భారత చమురు బాస్కెట్లో కీలక సరఫరాదారుగా కొనసాగించే అవకాశముంది. అయితే భారత్ రష్యాతో పాటు వెనిజులా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం వంటి ప్రాంతాల నుంచి కూడా కొనుగోళ్లను కొనసాగిస్తూ సరఫరా వనరులను విభిన్నీకరిస్తోంది.

