Tirumala : కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య ఈ ఏడాది సరికొత్త రికార్డులను సృష్టించింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 2026 మే నెలలో భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో పెరగడంతో, తలనీలాలు సమర్పించిన వారి సంఖ్య కూడా ఆల్టైమ్ హైకి చేరింది. మే నెల 27వ తేదీ నాటికే అత్యధికంగా 12.43 లక్షల మంది భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుని తలనీలాలు సమర్పించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారికంగా వెల్లడించింది. గత ఐదేళ్ల గణాంకాలతో పోల్చితే ఈ సంఖ్య చాలా ఎక్కువ. గత 2024 మే నెలలో ఈ సంఖ్య 10.65 లక్షలుగా ఉండగా, 2025 మే నెలలో 10.18 లక్షలుగా నమోదైంది. ఈ ఏడాది మే నెల ముగిసేసరికి ఈ రికార్డు మరిన్ని కొత్త మైలురాళ్లను తాకడం ఖాయంగా కనిపిస్తోంది.

భక్తుల సౌకర్యార్థం 11 మినీ కళ్యాణకట్టలు.. నిరంతరాయంగా 1,152 మంది క్షురకుల సేవలు!
తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వేగంగా తలనీలాలు సమర్పించేందుకు వీలుగా టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం తిరుమలలో అత్యంత భారీ సౌకర్యాలు ఉన్న ప్రధాన కళ్యాణకట్టతో పాటు భక్తుల రద్దీని వికేంద్రీకరించేందుకు మరో 11 మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచారు. ఈ కేంద్రాలలో భక్తులకు నిరంతరాయంగా సేవలు అందించేందుకు మొత్తం 1,152 మంది క్షురకులు (Barbers) మూడు షిఫ్టులలో రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు పోటెత్తిన భక్తుల రద్దీకి అనుగుణంగా టోకెన్ల జారీ, లైన్ల నిర్వహణ మరియు పరిశుభ్రత విషయంలో టీటీడీ ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్లే ఇంతటి రికార్డు స్థాయిలో తలనీలాల సమర్పణ ప్రక్రియ సులభంగా సాధ్యమైందని అధికారులు పేర్కొన్నారు.
ఒడిశాలో 1,500 సీట్ల భారీ యోగా, ధ్యాన మందిరం: ఎవరీ రాసేశ్వరి దేవి?

