RTA offices : తెలంగాణలోని RTA (రోడ్డు రవాణా శాఖ) కార్యాలయాల్లో బ్రోకర్ల వ్యవస్థపై ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని RTA (RTA offices) కార్యాలయాల్లో బ్రోకర్ల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రజలకు పారదర్శకమైన సేవలు :
ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడం, అవినీతికి అడ్డుకట్ట వేయడం, మధ్యవర్తుల జోక్యాన్ని పూర్తిగా నిర్మూలించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా అధికారులు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్, యాజమాన్య మార్పిడి, పర్మిట్ల జారీ వంటి సేవల కోసం వచ్చే ప్రజలను బ్రోకర్లు తప్పుదోవ పట్టించడం, అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడం వంటి ఫిర్యాదులు గత కొంతకాలంగా ప్రభుత్వానికి అందుతున్నాయి.

ఈ నేపథ్యంలో విజిలెన్స్ విభాగం ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. కొత్త ఆదేశాల ప్రకారం RTA కార్యాలయాల ప్రాంగణంలో అనుమతి లేని వ్యక్తులు తిరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. కార్యాలయాల వద్ద సీసీటీవీ పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడంతో పాటు అనుమానాస్పదంగా వ్యవహరించే బ్రోకర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అవసరమైతే పోలీసుల సహకారంతో ప్రత్యేక తనిఖీలు కూడా నిర్వహించనున్నారు. ప్రజలు తమ పనులను నేరుగా RTA కౌంటర్లలో లేదా అధికారిక ఆన్లైన్ సేవల ద్వారా చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎవరైనా బ్రోకర్లు డబ్బులు డిమాండ్ చేసినా లేదా అధికారుల పేరుతో మోసాలకు పాల్పడినా వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల RTA సేవలు మరింత పారదర్శకంగా, వేగంగా అందుతాయని, ప్రజలపై అదనపు ఆర్థిక భారం తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

