కేరళ రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభం కాబోతోంది. యూడీఎఫ్ (UDF) కూటమి ఘన విజయం తర్వాత కేరళ నూతన ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఈ నేపథ్యంలో నూతన మంత్రివర్గానికి సంబంధించిన కసరత్తు పూర్తయింది. మొత్తం 20 మందితో కూడిన మంత్రుల ముసాయిదా జాబితాను ఖరారు చేసి గవర్నర్కు అధికారికంగా పంపించారు. ఈ కొత్త క్యాబినెట్లో ప్రాంతీయ, సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూనే, మునుపెన్నడూ లేని విధంగా భారీ మార్పులు చేయడం కేరళ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
Read Also : 61 మంది మహిళలపై లైంగిక వేధింపులు.. భారతీయుడికి 13ఏళ్ల జైల శిక్ష!
యువతరం, కొత్త ముఖాలకు పెద్దపీట!
ఈసారి సతీశన్ క్యాబినెట్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం.. మంత్రుల ఎంపికలో చూపించిన సాహసోపేత నిర్ణయం. మొత్తం 20 మంది మంత్రులలో ఏకంగా 14 మంది కొత్తవారే కావడం విశేషం. అనుభవజ్ఞులతో పాటు యువతకు, కొత్త ముఖాలకు పరిపాలనలో అవకాశం కల్పించాలనే లక్ష్యంతోనే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక కూటమిలో కీలక భాగస్వామ్య పక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML)కు సముచిత స్థానం లభించింది. ఆ పార్టీకి క్యాబినెట్లో 5 మంత్రి పదవులు దక్కాయి. సమర్థవంతమైన, పారదర్శకమైన పాలన అందించడానికే ఈ సరికొత్త బృందాన్ని సతీశన్ రంగంలోకి దించుతున్నారు.
కేరళకు తరలిరానున్న జాతీయ నేతలు
ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్ ప్రమాణస్వీకార మహోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం భారీగా తరలిరానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ఈ వేడుకను ఒక భారీ రాజకీయ వేదికగా మార్చేందుకు యూడీఎఫ్ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆదర్శంగా సీఎం నిర్ణయం
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందే వి.డి. సతీశన్ తన మార్క్ పాలనను, నిరాడంబరతను చాటుకున్నారు. ప్రభుత్వ ఇంధన, ఆర్థిక పొదుపు చర్యల్లో భాగంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ వర్గాలతో పాటు ప్రజల్లో ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యమంత్రి భద్రత కోసం కొత్తగా ఎలాంటి కాన్వాయ్ వాహనాలను, ప్రత్యేక అంబులెన్స్లను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని ఆయన అధికారులను ఖచ్చితంగా ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న భద్రతా వనరులనే వినియోగించుకోవాలని స్పష్టం చేయడం ద్వారా, ప్రజా ధనాన్ని వృథా చేయననే బలమైన సంకేతాన్ని సతీశన్ ప్రజల్లోకి పంపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
బెంగళూరు-ముంబై మధ్య కొత్త ఎక్స్ప్రెస్ రైలు.. ప్రారంభించిన అశ్విని వైష్ణవ్!

