Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సత్వరమే భూ సమస్యలు పరిష్కరించేలా చర్యలు!

సత్వరమే భూ సమస్యలు పరిష్కరించేలా చర్యలు!

వార్త 5 days ago

Nellore PGRS Grievance: జిల్లా వ్యాప్తంగా ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేలా సంబంధిత తహశీల్దార్లు, మండల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ (JC) మొగిలి వెంకటేశ్వర్లు ఆదేశించారు.

సోమవారం నాడు నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలోని తిక్కన ప్రాంగణంలో 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (PGRS) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన బాధితుల నుండి జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి (DRO) విజయ్ కుమార్, తెలుగుగంగ ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి మహేశ్వర రెడ్డి, మెప్మా పీడీ కిరణ్ కుమార్, ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు మరియు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ (DD) నాగశేఖర్ తదితరులు నేరుగా అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా అధికారులు ఈ-పీటీఎస్ (e-PTS) డాక్యుమెంట్ల అప్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, పీజీఆర్ఎస్ ద్వారా వచ్చే ప్రజా సమస్యల అర్జీలను ఎప్పటికప్పుడు నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. అర్జీల పరిష్కార స్థితిగతులను సదరు అర్జీదారులకు ఎప్పటికప్పుడు ఫోన్ సందేశాలు లేదా రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. అలాగే, మంగళవారం జిల్లాలో పర్యటించనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ గారి పర్యటనను సంబంధిత శాఖల అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తమకు కేటాయించిన విధులను జాగరూకతతో నిర్వహించి విజయవంతం చేయాలని సూచించారు.

Read also: AP Rajya Sabha Nominations: నామినేషన్లు దాఖలు చేసిన కూటమి రాజ్యసభ అభ్యర్థులు

బాధితులకు ఉచిత భోజనం - ప్రత్యేక కౌంటర్లు

సుదూర గ్రామీణ ప్రాంతాల నుండి ఎండ తీవ్రతను తట్టుకుని కలెక్టరేట్‌కు వచ్చే అర్జీదారుల కోసం జిల్లా యంత్రాంగం అధునాతన మౌలిక వసతులను కల్పించింది. తిక్కన ప్రాంగణం వెలుపల చలువ పందిళ్లను నిర్మించి, త్రాగునీటి వసతితో పాటు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అలాగే అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలందరికీ యంత్రాంగం ఉచిత భోజన సదుపాయాన్ని విజయవంతంగా అందించింది. ముఖ్యంగా రెవెన్యూ సంబంధిత భూ వివాదాలను అక్కడికక్కడే క్షుణ్ణంగా పరిశీలించేందుకు ప్రత్యేక కౌంటర్లను, అత్యవసర ప్రాథమిక వైద్యం అందించేందుకు మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేశారు.

Nellore PGRS Grievance: పరిష్కార వేదికకు 388 అర్జీలు

సోమవారం నిర్వహించిన ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుండి మొత్తం 388 అర్జీలు వచ్చాయి. ఇందులో ఎప్పటిలాగే భూ వివాదాలు, ఆన్‌లైన్ అడంగల్ తప్పులు, పాస్ బుక్కుల జారీకి సంబంధించి గరిష్టంగా రెవెన్యూ శాఖకే 168 అర్జీలు రావడం గమనార్హం. శాంతిభద్రతలు, సివిల్ వివాదాలపై పోలీస్ శాఖకు 42 అర్జీలు, పట్టణ మౌలిక వసతులపై మున్సిపల్ శాఖకు 24 అర్జీలు రాగా.. మిగిలిన అర్జీలు ఇతర సంక్షేమ శాఖలకు అందాయి. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని జేసీ ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha