Joorala Gates Open: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో, జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా ఇన్ ఫ్లో వస్తోంది.
దీంతో జలాశయ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరడంతో ప్రాజెక్టు అధికారులు గురువారం ఉదయం 10 గేట్లను ఒక మీటర్ ఎత్తు వరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
జూరాల ఇన్ ఫ్లో – అవుట్ ఫ్లో వివరాలు
జలవనరుల శాఖ అధికారులు అందించిన వివరాల ప్రకారం.. ప్రాజెక్టుకు ఎగువ నుంచి ప్రస్తుతం 46,580 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు అవుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి అనుగుణంగా ప్రస్తుతం నీటిమట్టం 7.371 టీఎంసీలుగా నమోదైంది. వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు పంపేందుకు అధికారులు 10 గేట్ల ద్వారా 9,717 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం వైపు విడుదల చేస్తున్నారు. దీనికి తోడు ప్రాజెక్టు విద్యుత్ ఉత్పాదన కేంద్రం (పవర్ హౌస్) ద్వారా ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తూ మరో 29,725 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
Joorala Gates Open: తాగు, సాగు నీటి కాలువలకు విడుదల
ప్రధాన జలాశయంతో పాటు పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులు, కాలువలకు కూడా నీటి విడుదల కొనసాగుతోంది. భీమా లిఫ్ట్-1కు 1,300 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2కు 73 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకానికి 492 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. అలాగే జూరాల ఎడమ కాలువకు 935 క్యూసెక్కులు, కుడికాలువకు 396 క్యూసెక్కులు, సమాంతర కాలువకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మొత్తంగా జూరాల ప్రాజెక్టు నుంచి అన్ని మార్గాల ద్వారా కలిపి 44,254 క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదువుతోంది.
కృష్ణా నది ప్రవాహం పెరగడంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పరుగులు తీస్తోంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

