Nallamala Forest Restrictions:శ్రీశైలం వెళ్లే పర్యాటకులు, భక్తులు ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నల్లమలలో 3 నెలల పాటూ నో ఎంట్రీ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
పెద్ద పులుల సంతానోత్పత్తి సమయం కావడంతో అటవీశాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీసీఏ ఆదేశాల మేరకు టైగర్ రిజర్వ్ పరిధిలోని అటవీ మార్గాల్లోకి ప్రజలను అనుమతించరు. ఈ సమయంలో జంగిల్ సఫారీలను పూర్తిగా నిలిపివేశారు. భక్తులు, పర్యాటకులు అధికారులకు సహకరించి ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని సూచనలు అందుతున్నాయి.
Read also: AP CM Tour: సీఎం చంద్రబాబు ఐదు రోజుల జిల్లాల పర్యటన
Nallamala forest no entry zone
అటవీ మార్గాల్లో మూతపడిన పుణ్యక్షేత్రాలు
నల్లమల అభయారణ్యం పరిధిలోని అనేక పర్యాటక ప్రాంతాలు, ఆలయాల సందర్శనపై నిషేధం విధించారు. ముఖ్యంగా మార్కాపురం, ఆత్మకూరు, నంద్యాల డివిజన్లలో సఫారీలు నిలిపివేశారు. ఇష్టకామేశ్వరీదేవి ఆలయం, రుద్రకోడూరు క్షేత్రం, గుండ్ల బ్రహ్మేశ్వర ఆలయాలకు భక్తుల రాకపోకలను మూడు నెలల పాటు అనుమతించరు. వన్యప్రాణుల ఏకాంతానికి భంగం కలగకుండా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. బఫర్ ఏరియాలోని ఎకో టూరిజం వసతులు తప్ప మిగిలిన అటవీ ప్రాంతాల్లో పర్యటనలు ఉండవు. అటవీ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Nallamala Forest Restrictions:పులుల సంరక్షణ కోసం కఠిన ఆంక్షలు
నాగార్జున సాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యంలో ప్రస్తుతం సుమారు 90 పులులు ఉన్నాయి. వర్షాకాలంలో పులులు సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి కాబట్టి ప్రశాంతమైన వాతావరణం అవసరం. ఈ సమయంలో మనుషుల సంచారం ఉంటే పులులు దాడి చేసే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా మూడు నెలల పాటు నిషేధం అమలు చేస్తున్నారు. చిరుతలు, ఎలుగుబంట్లు, దుప్పులు వంటి ఇతర వన్యప్రాణుల రక్షణ కూడా ఈ ఆంక్షల ఉద్దేశ్యం. పర్యాటకులు, స్థానికులు ఈ నియమాలను పాటిస్తూ అటవీశాఖకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
Epaper: epaper.vaartha.com

