KTR: ఉత్తర తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి, స్థానిక యువత ఉపాధికి ప్రాణాధారమైన ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్లాంట్ను పునరుద్ధరించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ మండిపడ్డారు.
ప్లాంట్ను మళ్లీ తెరిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుధవారం ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ పరిశ్రమపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కేంద్రం సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానిదే ఆలస్యం
ఇటీవల జులై 15న సీసీఐ సాధన సమితి, బీఆర్ఎస్ బృందంతో కలిసి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కలిసిన సందర్భాన్ని కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. ఆదిలాబాద్ యూనిట్ను పునఃప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ₹250 కోట్లు కేటాయించి, అవసరమైన మౌలిక వసతులు మరియు ప్రోత్సాహకాలు అందించాల్సి ఉందని కుమారస్వామి తెలిపారన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి సరైన ప్రతిపాదన రాకపోవడం వల్లే ఈ ప్రక్రియ నిలిచిపోయిందని స్పష్టం చేశారు.
KTR: హామీలకే పరిమితమైన కాంగ్రెస్ పాలన
ఎన్నికల సమయంలో ఆదిలాబాద్ను సందర్శించి సీసీఐని తెరిపిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను విస్మరించారని కేటీఆర్ ఆరోపించారు. రెండున్నరేళ్ల రేవంత్ పాలనలో ప్లాంట్ను పునరుద్ధరించేందుకు ఎటువంటి అడుగులు ముందుకు పడలేదని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఆధ్వర్యంలో కేంద్రానికి ఎన్నో లేఖలు రాశామని, టీఎస్-ఐపాస్ కింద సబ్సిడీలతో పాటు భాగస్వామ్య ప్రాతిపదికన లేదా పూర్తిగా రాష్ట్రమే ప్లాంట్ను నడిపేందుకు సిద్ధమని ఆనాడే ప్రతిపాదించామని గుర్తుచేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏ క్షణంలోనూ ఆలస్యం చేయకుండా సీసీఐ పునరుద్ధరణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కోరారు.

