Vijay Court Case: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసఫ్ విజయ్ (C. Joseph Vijay) తో పాటు ఆయన కేబినెట్లోని కీలక మంత్రి ఆదవ్ అర్జున (Aadhav Arjuna) కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వీరిద్దరి విజయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు ఎన్నికల పిటిషన్లను (Election Petitions) న్యాయస్థానం అధికారికంగా విచారణకు స్వీకరించింది. ప్రతివాదులైన సీఎం విజయ్, మంత్రి ఆదవ్ అర్జునలకు కోర్టు నోటీసులు జారీ చేసింది.
Read Also:Dhanush Political Entry:విజయ్ బాటలో ధనుష్? హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ఊహాగానాలు!
ఆ నియోజకవర్గాల ఫలితాలపై సవాల్

ఈ ఏడాది జరిగిన ఉత్కంఠభరిత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పెరంబూర్ (Perambur), తిరుచ్చి ఈస్ట్ (Tiruchirappalli East) నియోజకవర్గాల నుండి సీఎం జోసెఫ్ విజయ్ సాధించిన విజయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా, విల్లివాక్కం (Villivakkam) నియోజకవర్గం నుండి గెలుపొంది, ప్రస్తుతం రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ మరియు క్రీడల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆదవ్ అర్జున విజయానికి వ్యతిరేకంగా కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నియోజకవర్గాల్లో ఎన్నికల అక్రమాలు జరిగాయంటూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు.
టెక్నికల్ లోపాలు – కోర్టు కీలక ఆదేశాలు
ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ వి. లక్ష్మీనారాయణ (Justice V. Lakshminarayanan) ధర్మాసనం.. ప్రస్తుత పిటిషన్లలో ఎన్నికల నిబంధనలకు సంబంధించిన కొన్ని సాంకేతిక, పరిపాలనాపరమైన అవసరాలు (ఉదాహరణకు ఫారం 25 దాఖలు చేయడం) లోపించాయని పేర్కొన్నారు.పిటిషనర్లు వారం రోజుల్లోగా ఆయా నిబంధనలను పూర్తి చేసి, పిటిషన్లలో అవసరమైన సవరణలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ సవరణల ప్రక్రియ పూర్తయిన తర్వాత, ప్రతివాదులకు (సీఎం విజయ్, మంత్రి ఆదవ్ అర్జునలకు) రిజిస్ట్రీ ద్వారా అధికారిక నోటీసులు జారీ చేయాలని, వారు 3 వారాల లోపు దీనిపై కోర్టుకు సమాధానం (Counter) ఇవ్వాలని స్పష్టం చేసింది.
Vijay Court Case: 6 నెలల్లోగా విచారణ పూర్తి – పొలిటికల్ హీట్
సాధారణంగా ఎన్నికల పిటిషన్ల విచారణను చట్ట ప్రకారం 6 నెలల్లోగా వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సి ఉంటుందని న్యాయమూర్తి గుర్తుచేశారు. ఈ క్రమంలోనే కోర్టు ద్వారా వెళ్లే అధికారిక నోటీసులతో పాటు, పిటిషనర్లు తమ వ్యక్తిగత స్థాయిలో కూడా ప్రతివాదులకు ‘ప్రైవేట్ నోటీసులు’ పంపడానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. తమిళనాడులో త్వరలోనే కొన్ని స్థానాలకు ఉపఎన్నికలు జరగబోతున్న తరుణంలో.. ఏకంగా ముఖ్యమంత్రి, మంత్రి ఎన్నికల ఫలితాలపైనే హైకోర్టు పూర్తి స్థాయి విచారణకు సిద్ధమవడం ద్రవిడ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
Epaper: epaper.vaartha.com

