Punjab Police Espionage Case: భారత సరిహద్దు రక్షణను మరియు అంతర్గత భద్రతను దెబ్బతీసేందుకు పొరుగు దేశం పన్నుతున్న సరికొత్త డిజిటల్ కుట్ర పంజాబ్ రాష్ట్రంలో బట్టబయలైంది.
భారత సైన్యం (Indian Army), పారామిలటరీ దళాల కదలికలకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్లోని హ్యాండ్లర్లకు చేరవేస్తున్న ఒక భారీ అంతర్జాతీయ గూఢచర్య నెట్వర్క్ను పంజాబ్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. పఠాన్కోట్-జమ్మూ జాతీయ రహదారి-44 (NH-44) పై ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, రక్షణ దళాల వాహనాల రాకపోకలను పాక్తో పాటు విదేశాల్లోని ఆపరేటర్లకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో లైవ్ ఫుటేజ్ పంపుతున్న నిందితుడిని పఠాన్కోట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైవేపై రహస్య నిఘా.. దుబాయ్ నుంచి ఆదేశాలు!
The police have busted an international espionage ring.
పోలీసుల కథనం ప్రకారం.. పఠాన్కోట్ జిల్లా చక్ ధరివాల్ గ్రామానికి చెందిన బల్జీత్ సింగ్ అలియాస్ బిట్టూ అనే వ్యక్తిని సుజాన్పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో సుజాన్పూర్ సమీపంలోని హైవేపై ఉన్న ఒక దుకాణంలో ఇంటర్నెట్ ఆధారిత సీసీటీవీ కెమెరాను అమర్చినట్లు నిందితుడు అంగీకరించాడు. దుబాయ్లోని ఒక అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ నిఘా ఏర్పాటు చేశాడని, ఇందుకు గానూ అతనికి రూ. 40,000 అందినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడి నుంచి వైఫై రూటర్, సీసీటీవీ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బల్జీత్తో పాటు విక్రమ్జిత్ సింగ్, బల్విందర్ సింగ్, తరణ్ప్రీత్ సింగ్ అనే మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ ముగ్గురు నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
Punjab Police Espionage Case: చైనా మేడ్ సోలార్ కెమెరాలతో ఐఎస్ఐ హైటెక్ ప్లాన్
పంజాబ్ వ్యాప్తంగా సైనిక స్థావరాలపై నిఘా పెట్టేందుకు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) అత్యంత హైటెక్ పద్ధతులను వాడుతున్నట్లు పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) గౌరవ్ యాదవ్ వెల్లడించారు. ఇటీవల జలంధర్, కపుర్తలా ప్రాంతాల్లో ఇలాంటి రెండు పెద్ద గూఢచార మోడ్యూళ్లను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఇవి విద్యుత్ వైరింగ్ అవసరం లేని, 4జీ కనెక్టివిటీ కలిగిన చైనా తయారీ సోలార్ సీసీటీవీ కెమెరాలు (China-made Solar CCTV Cameras) కావడం గమనార్హం. వీటిని ఆర్మీ క్యాంప్ల సమీపంలో ఏర్పాటు చేసి మొబైల్ యాప్ల ద్వారా నేరుగా పాకిస్థాన్కు లైవ్ విజువల్స్ పంపుతున్నారు.
జలంధర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్లో ఫిరోజ్పూర్కు చెందిన సుఖ్విందర్ సింగ్ అనే ఆపరేటివ్ను చైనా కెమెరా, సోలార్ ప్లేట్తో సహా అరెస్ట్ చేశారు. కపుర్తలా ఆర్మీ కంటోన్మెంట్ సమీపంలో మోడల్ టౌన్లోని ఒక దుకాణాన్ని అద్దెకు తీసుకుని, సమీపంలోని స్తంభానికి కెమెరా అమర్చి నిఘా పెట్టిన సోనా, సందీప్ సింగ్ అనే ఇద్దరు నిందితులను కూడా కపుర్తలా పోలీసులు పట్టుకున్నారు.
డ్రగ్స్ కనెక్షన్.. డ్రోన్ల ద్వారా హెరాయిన్ సరఫరా
కపుర్తలా ఎస్ఎస్పీ గౌరవ్ తూరా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మోడ్యూల్ వెనుక పాకిస్థాన్కు చెందిన ‘ఫౌజీ’ అనే హ్యాండ్లర్ ఉన్నాడు. కెమెరా ఏర్పాటుకు నిందితులకు రూ. 35,000 ఇచ్చిన ఈ హ్యాండ్లర్.. డ్రోన్ల ద్వారా ఒక కిలో హెరాయిన్ డ్రగ్స్ను కూడా సరిహద్దు దాటించాడు. ఆ డ్రగ్స్ను పంపిణీ చేసినందుకు నిందితుడు సందీప్కు అదనంగా రూ. 50,000 అందినట్లు దర్యాప్తులో తేలింది. ఈ గూఢచర్య నెట్వర్క్ల వెనుక ఉన్న సరిహద్దుల అవతలి లింకులు, నిధుల మూలాలపై సమగ్ర నివేదికను పంజాబ్ పోలీసులు ఉన్నతాధికారులకు సమర్పించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
భారత్ తో వ్యూహాత్మక భాగస్వామ్యంపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు

