Telangana Student Died In Spain: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణకు చెందిన ఒక యువకుడు స్పెయిన్లో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
పెద్దపల్లి జిల్లాకు చెందిన గీట్ల సాయి అఖిల్ రెడ్డి (30) స్పెయిన్లోని ప్రముఖ వేలెన్సియా (Valencia) నగరంలో ఆదివారం రాత్రి ఒక భవనం పైనుండి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. ఉన్నత భవిష్యత్తును వెతుక్కుంటూ వెళ్లిన కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
Read Also:Iran-US War: బహ్రెయిన్, కువైట్లపై ఇరాన్ దాడులు.. అమెరికాకు టెహ్రాన్ హెచ్చరిక

స్థానికులు మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం పరిధిలోని కూనారం గ్రామానికి చెందిన గీట్ల సాయి అఖిల్ రెడ్డి స్పెయిన్లోని వేలెన్సియా సిటీలో హోటల్ మేనేజ్మెంట్ (Hotel Management) కోర్సు చదువుతున్నాడు. కాగా, ఆదివారం రాత్రి ఆయన నివసిస్తున్న భవనం పైనుండి కింద పడిపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు.
Telangana Student Died In Spain: పుట్టెడు దుఃఖంలో కన్నవారు..
కంటికి రెప్పలా పెంచిన ఒక్కగానొక్క కొడుకు విదేశీ గడ్డపై విగతజీవిగా మారాడన్న చేదు వార్త వినగానే తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగంతో ఇల్లు నిలబెడతాడనుకున్న కొడుకు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగింది? కాలు జారి పడ్డాడా లేక మరేదైనా కారణం ఉందా? అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానిక స్పెయిన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకురావడానికి సహాయం చేయాలని విద్యార్థి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, విదేశాంగ మంత్రిత్వ శాఖను వేడుకుంటున్నారు.
Epaper: epaper.vaartha.com

