Botsa Satyanarayana: విశాఖ స్టీల్ ప్లాంట్ పేలుడు దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి, నగరంలోని కేజీహెచ్ (KGH) ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందం పరామర్శించింది.
పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, కేకే రాజు తదితరులు బాధితులను కలిసి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ.. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు న్యాయమైన పరిహారం కోరుతున్నారని, వారి డిమాండ్లను ప్రభుత్వం గొంతెమ్మ కోరికలుగా చూడకుండా తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Read also: YS Jagan: రేపు విశాఖకు వైఎస్ జగన్.. స్టీల్ ప్లాంట్ బాధితులకు పరామర్శ
దొడ్డిదారిన అధికారుల బదిలీలు.. ప్రైవేట్ పరంచేసేందుకేనా?
రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తమకు నచ్చిన కార్పొరేట్ శక్తులకు, తాబేదార్లకు కట్టబెట్టేందుకు తెరవెనుక కుట్రలు చేస్తోందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ప్లాంట్ను ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణ వైపు అడుగులు వేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ నిర్లక్ష్య వైఖరి వల్లే ప్లాంట్లో రక్షణ చర్యలు కరవై, వరుస ప్రమాదాలు జరుగుతూ కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని దుయ్యబట్టారు.
స్టీల్ ప్లాంట్లో ఎంతో అనుభవజ్ఞులైన, సమర్థులైన ఉన్నతాధికారులను దొడ్డిదారిన ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం వల్లే ప్లాంట్ నిర్వహణ లోపించి ఈ భారీ పేలుడు సంభవించిందని విమర్శించారు. ఇప్పటికే దాదాపు 10 వేల మంది పర్మనెంట్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులను అన్యాయంగా విధుల్లోంచి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులపై ఒత్తిడి తెస్తూ అమలు చేస్తున్న బలవంతపు వీఆర్ఎస్ (VRS) ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
Botsa Satyanarayana: ‘ఎల్జీ పాలిమర్స్’ తరహాలోనే కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి!
గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ ప్రమాద బాధితులకు అందించిన తరహాలోనే, ఈ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మరణించిన కార్మికుల కుటుంబాలకు కూడా కోటి రూపాయల చొప్పున భారీ ఎక్స్గ్రేషియా ప్రకటించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అలాగే, బాధితులను స్వయంగా పరామర్శించి, ధైర్యం చెప్పేందుకు రేపు (బుధవారం) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించనున్నట్లు బొత్స ఈ సందర్భంగా వెల్లడించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:

