Suryapet BRS Leader: సూర్యాపేట జిల్లాలో రాజకీయ కక్షలు మరోసారి రక్తపాతం సృష్టించాయి. సూర్యాపేట మండలంలోని ఎర్కారం గ్రామంలో మాజీ సర్పంచ్ మౌనిక భర్త, బీఆర్ఎస్ నేత చింతలపాటి మధును దుండగులు అత్యంత దారుణంగా హత్యా చేసారు.
ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించడమే కాకుండా, జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. మధును గ్రామంలోనే హత్య చేసిన దుండగులు, అనంతరం సాక్ష్యాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించారు. మృతదేహాన్ని గ్రామ శివారులోకి తీసుకెళ్లి పడవేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయాన్నే మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Brutal murder of BRS leader in Suryapet!
నిందితుల కోసం గాలింపు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో కొనసాగుతున్న పాత రాజకీయ విభేదాలు, ఆధిపత్య పోరే ఈ ఘాతుకానికి ప్రధాన కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల పూర్తి కారణాలను వెలికితీసేందుకు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
చింతలపాటి మధు భార్య మౌనిక గతంలో బీఆర్ఎస్ తరఫున ఎర్కారం గ్రామ సర్పంచ్గా పనిచేశారు. గ్రామ రాజకీయాల్లో వారి కుటుంబానికి సుదీర్ఘ చరిత్ర, ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నాయి. అయితే కొంతకాలంగా గ్రామంలోని మరో వర్గంతో రాజకీయ ఆధిపత్య పోరు నడుస్తోందని స్థానికులు చెబుతున్నారు.
ఈ గ్రామంలో ఇలాంటి ఘోరం జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బీఆర్ఎస్ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న కూడా ఇదే తరహాలో దారుణ హత్యకు గురయ్యారు. ఇప్పుడు మళ్లీ అదే గ్రామంలో, అదే పార్టీకి చెందిన మరో ముఖ్య నేత మధు హత్యకు గురికావడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక పోలీసు గాలింపు చర్యలు చేపట్టారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com

