KTR Telangana Formation Day Speech: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం 'తెలంగాణ భవన్' లో ఆవిర్భావ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ భవన్కు చేరుకున్న కేటీఆర్.. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ జానపద, సాంస్కృతిక కళాకారులను కేటీఆర్ శాలువాతో సన్మానించారు. అనంతరం జరిగిన సభలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Read Also : Telangana Formation Day:రాజ్ భవన్ లో ఘనంగా అవతరణ దినోత్సవ వేడుకలు
KTR’s key remarks at the state formation celebrations at Telangana Bhavan
2028 కేసీఆరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.. కేటీఆర్ ధీమా
మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కార్యకర్తల్లో, ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపేలా కీలక వ్యాఖ్యలు చేశారు. “వేటగాడు చెప్పే పిట్టకథలు నిజం కావొద్దు అనుకుంటే.. సింహం తన కథను తనే చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమం గురించి, కేసీఆర్ చేసిన అభివృద్ధి గురించి మనమందరం గర్వంగా చెప్పుకోవాలి” అని పిలుపునిచ్చారు. “రాబోయే 2028 డిసెంబర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుంది. మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.” 24 గంటల కరెంట్ దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత, నాణ్యమైన కరెంట్ ఇచ్చిన ఏకైక ఘనత కేసీఆర్ది. ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందించి మహిళల నీటి కష్టాలు తీర్చింది కేసీఆర్ ప్రభుత్వం. పదేళ్ల కాలంలో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వెలుగులు నింపింది.
అబద్ధాలు, అభూత కల్పనలు, మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ మండిపడ్డారు. “ప్రపంచం, దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీని వదిలించుకుంటుంటే.. తెలంగాణ ప్రజలు దురదృష్టవశాత్తూ ఆ పార్టీని కొనితెచ్చుకున్నారు. అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. తెలంగాణను మరో 20 ఏళ్లు వెనక్కి నెట్టింది” అని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ఎంతో అద్భుతంగా వడ్డించిన విస్తరాకులా ఉన్న తెలంగాణను.. సీఎం రేవంత్ రెడ్డి కుక్కలు చింపిన విస్తరాకులా మార్చేశారని తీవ్రంగా ధ్వజమెత్తారు.
KTR Telangana Formation Day Speech: తెలంగాణ అంతటా సంక్షోభం.. కేటీఆర్ ప్రశ్నల వర్షం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎండగడుతూ కేటీఆర్ పలు విమర్శలు చేశారు. రైతులకు సకాలంలో యూరియా ఇవ్వని చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పండిన పంటలను సైతం కనీస మద్దతు ధరకు కొనలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను నమ్మించిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు? రాష్ట్రంలో ఒక్క కొత్త ఇటుక పెట్టకుండా, ఎలాంటి అభివృద్ధి చేయకుండానే కేవలం కొద్ది కాలంలోనే 4 లక్షల కోట్ల అప్పులు చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి ప్రస్తుతం దారుణంగా మారింది. రాష్ట్రంలో రైతు బంధు పథకం పూర్తిగా బంద్ అయింది.. కానీ రేవంత్ రెడ్డి 'రాహుల్ బంద్' మాత్రం నిరంతరాయంగా కొనసాగుతోంది.
మనమందరం కలిసి తెలంగాణను కాపాడుకుందాం
తమకు అధికారం కోసం ఎలాంటి ఆరాటం లేదని, ప్రజాసేవ కోసమే బీఆర్ఎస్ పనిచేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. “అధికారం వస్తే వస్తుంది.. లేకపోతే లేదు. కానీ, ఎంతో సమున్నతంగా ఎదిగిన పుష్కర తెలంగాణ.. దురదృష్టవశాత్తూ నేడు ముష్కరుల పాలైంది” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మార్కు అరాచక పాలన నుండి తెలంగాణను, ఇక్కడి ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవడానికి మనమందరం కలిసికట్టుగా పోరాడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్!

