Telangana Jagruthi President: తెలంగాణ సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన 'తెలంగాణ జాగృతి' సంస్థలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. గడిచిన రెండు దశాబ్దాలుగా సంస్థను ముందుండి నడిపించిన కల్వకుంట్ల కవిత ఇకపై ఫౌండర్ ఛైర్పర్సన్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
అదే సమయంలో తెలంగాణ జాగృతి నూతన రాష్ట్ర అధ్యక్షురాలిగా మారిపల్లి మాధవిని నియమిస్తూ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని, సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించే లక్ష్యంతోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కవిత స్పష్టం చేశారు.
తెలంగాణ జాగృతి ప్రయాణం – 2006 నుంచి సేవలు
మలిదశ తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో, ప్రాంతీయ సంస్కృతి మరియు చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పేందుకు 2006లో కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతిని స్థాపించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సాంస్కృతిక పరిరక్షణ ద్వారా జాగృతి కొండంత బలాన్ని చేకూర్చింది. తెలంగాణ భాష, సంస్కృతి, పునరుజ్జీవనమే ప్రధాన లక్ష్యంగా ఈ సంస్థ నిరంతరం కృషి చేస్తోంది.
Telangana Jagruthi President: బతుకమ్మ పండుగకు విశ్వవ్యాప్త గుర్తింపు

తెలంగాణ పల్లెలకే పరిమితమైన బతుకమ్మ పండుగను గ్లోబల్ ప్లాట్ఫామ్పైకి తీసుకువెళ్లడంలో తెలంగాణ జాగృతి పోషించిన పాత్ర అద్వితీయమైనది.బతుకమ్మ వేడుకల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలను పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములను చేసిన ఘనత జాగృతికే దక్కుతుంది. కొత్త అధ్యక్షురాలి నాయకత్వంలో సంస్థ మరింత బలోపేతమై, అదే స్ఫూర్తితో ప్రజా చైతన్య కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుందని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.

