Rain Effect : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. తొలకరి చినుకులు ఆలస్యమైనప్పటికీ, ఇటీవల కురిసిన సమృద్ధిగా వర్షాలతో కరువు మేఘాలు తొలిగిపోయి పొలాలన్నీ జలకళను సంతరించుకున్నాయి.
వర్షాలు పడక ఈ ఏడు సాగు చేయలేమోనని ఆందోళన చెందిన రైతన్నలు, ఇప్పుడు మళ్లీ నాగలి పట్టి పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత వారం వరకు కేవలం 60 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగవ్వగా, తాజా వర్షాల ధాటికి మరో 20 లక్షల ఎకరాల విస్తీర్ణం పెరిగి మొత్తం సాగు విస్తీర్ణం 80 లక్షల ఎకరాలకు చేరుకోవడం విశేషం.

నిండిన చెరువులు, రిజర్వాయర్లు: వాణిజ్య పంటలకు ప్రాణం పోసిన వానలు
రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, ప్రధాన రిజర్వాయర్లు జలకళతో తొలకడుతుండటంతో ఆయా ఆయకట్టు పరిధిలోని రైతులు అత్యంత ఉత్సాహంతో వరినాట్ల పనులను వేగవంతం చేశారు. కేవలం వరి పంటకే కాకుండా, వర్షాభావంతో ఎండిపోయే దశకు చేరుకున్న పత్తి, మొక్కజొన్న, కంది, చెరకు వంటి ఇతర వాణిజ్య మరియు మెట్ట పంటలకు కూడా ఈ వానలు ఊపిరి పోశాయి. ప్రాజెక్టుల నుంచి నీటి ప్రవాహం పెరగడం, భూగర్భ జలాలు పుష్కలంగా పైకి లేవడంతో ఈ వానకాలం సీజన్ ప్రశాంతంగా, సమృద్ధిగా పంట దిగుబడులతో సాగుతుందనే ధీమాను వ్యవసాయ నిపుణులు మరియు రైతాంగం వ్యక్తం చేస్తున్నారు.

