Dailyhunt

TG Crime: మహబూబాబాద్‌లో అనుమానాస్పద మృతి వెనుక షాకింగ్ ట్విస్ట్‌

వార్త 3 months ago
TG Crime: మహబూబాబాద్‌లో అనుమానాస్పద మృతి వెనుక షాకింగ్ ట్విస్ట్‌

మహబూబాబాద్(TG Crime) జిల్లా కేసముద్రం మండలం బోడమంచ తండాకు చెందిన భూక్య వీరన్న మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది.

స్థానికుల కథనం ప్రకారం, సోమవారం రాత్రి వీరన్నకు ఓ ఫోన్ కాల్ రావడంతో ఫోన్‌లో మాట్లాడుతూ ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే అర్ధరాత్రి దాటినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలో పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు.

వరి పొలంలో రక్తపు మరకలు… హత్య అనుమానాలు

మంగళవారం ఉదయం(TG Crime) వ్యవసాయ పనులకు వెళ్తున్న ఓ వ్యక్తి తండా సమీపంలో వీరన్న మృతదేహాన్ని గుర్తించి కుటుంబానికి సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు వీరన్న తలపై తీవ్ర గాయాలు ఉండటంతో పాటు, సమీపంలోని వరి పొలంలో రక్తపు మరకలు ఉండటాన్ని గమనించారు. దీంతో వీరన్నను హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

తండాలో ఉద్రిక్తత… ఆందోళన, దహనాలు

వీరన్న మృతి నేపథ్యంలో బోడమంచ తండాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం తండావాసులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అనుమానితులుగా భావిస్తూ ఆర్‌ఎంపీ భరత్‌, బోడ బాలు ఇళ్లను ముట్టడించారు. ఈ క్రమంలో ఆర్‌ఎంపీకి చెందిన బైక్‌, ఓ షాపును తగులబెట్టడంతో పాటు బాలు ఇంటిని ధ్వంసం చేశారు.

పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అడ్డుకోవడంతో తండావాసులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తండాలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

విచారణలో వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం

ఈ కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. పోలీసుల లోతైన విచారణలో వీరన్న హత్య వెనుక అతని భార్య విజయ పాత్ర ఉన్నట్లు తేలింది. భార్య విజయ తన ప్రియుడు ఆర్‌ఎంపీ డాక్టర్ భరత్‌తో కలిసి వీరన్నను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు.

రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ కోసమే హత్య?

వీరన్న పేరుపై ముందుగానే రూ.10 లక్షల ఇన్సూరెన్స్ చేయించుకున్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ ఇన్సూరెన్స్ మొత్తాన్ని పొందాలనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానితులైన భార్య విజయతో పాటు ఆమె ప్రియుడు భరత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇది హత్యేనని పోలీసులు స్పష్టం చేస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Banglore crime: భార్యను కాల్చి చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..వైవాహిక విభేదాలే హత్యకు కారణమా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha