Chandrababu Coffee Kaburlu Meeting: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహించిన ఈ ముఖాముఖి కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్లతో అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో రాజకీయ, పరిపాలనా అంశాలపై చర్చించారు.


ఈ సందర్భంగా చంద్రబాబు కార్యకర్తలకు విలువలతో కూడిన రాజకీయాల గురించి వివరించారు.రాజకీయాల్లో నిజాయతీగా ఉంటేనే గౌరవం ఉంటుందని,


టీడీపీని ‘క్లీన్ పాలిటిక్స్’కు చిరునామాగా మార్చాలని పిలుపునిచ్చారు.రాజకీయాన్ని ప్రజలకు సేవ చేసే వేదికగా చూడాలి తప్ప, జీవనోపాధిగా ఎంచుకోకూడదని హితవు పలికారు.


“నాడు ఐటీతో హైదరాబాద్ను అభివృద్ధి చేసినట్టే, నేడు క్వాంటం టెక్నాలజీతో ఏపీని, అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం. ఈ నెల 14న క్వాంటం టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభిస్తాం” అని వెల్లడించారు. గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను 9 సార్లు పెంచిందని,

తమ ప్రభుత్వం ఛార్జీలను తగ్గిస్తోందని స్పష్టం చేశారు. సోలార్ విద్యుత్ వినియోగంపై ఫీడ్బ్యాక్ తీసుకోగా, తమ విద్యుత్ బిల్లుల భారం తగ్గిందని పలువురు కార్యకర్తలు ముఖ్యమంత్రికి తెలిపారు.


సమగ్ర నీటి నిర్వహణ ద్వారా ప్రాజెక్టులను నింపామని, మే 15 నాటికే పంటలకు నీరు అందిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రతి కులానికి దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం, ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు.







