Guru Purnima Tirumala: పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురుపౌర్ణమి పర్వదినం కావడంతో శ్రీవారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలివచ్చారు.
ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేకుండా ఉదయం సర్వదర్శనం క్యూ లైన్లోకి ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ల వద్ద భక్తులకు జారీ చేసే ఉచిత సర్వదర్శనం (SSD) టోకెన్ల జారీని బుధవారం రోజున రద్దు చేసింది. తిరిగి శుక్రవారం నాటి దర్శనానికి సంబంధించి గురువారం మధ్యాహ్నం నుండి యథావిధిగా ఎస్ఎస్డీ టోకెన్లను జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Also : Vizag Airport : విశాఖ నుంచి కమర్షియల్ విమానాలకు బ్రేక్
Guru Purnima rush in Tirumala; TTD cancels SSD tokens.
Guru Purnima Tirumala: శ్రీవారి సేవకుల విషయంలో కీలక నిర్ణయం
శ్రీవారి సేవను మరింత విస్తరించే దిశగా టీటీడీ ఈవో రవిచంద్ర గ్రూప్ సూపర్ వైజర్లతో సమావేశమై పలు సూచనలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 50 వేల ఆలయాలు ఉన్నాయని, ఆయా దేవాలయాల్లో శ్రీవారి సేవ ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించే అవకాశాలను టీటీడీ దృష్టికి తీసుకురావాలని కోరారు. గ్రూప్ సూపర్వైజర్లు నేర్చుకున్న అంశాలను తమ ప్రాంతాల నుండి తిరుమలకు విచ్చేసే సేవకులకు ముందుగానే వివరించాలని, దీనివల్ల తిరుమలలో నాణ్యమైన సేవలు అందించే వీలు కలుగుతుందని తెలిపారు. శ్రీవారి సేవకులు తిరుమలకు రావడమే కాకుండా, తమ స్వగ్రామాలు మరియు ప్రాంతాల్లోని స్థానిక ఆలయాల్లోనూ సేవలందించేలా వారిని ప్రోత్సహించాలని సూచించారు.
'సిబిల్ స్కోర్' తరహాలో సేవకులకు రేటింగ్!
శ్రీవారి సేవకుల పనితీరు ఆధారంగా సిబిల్ స్కోర్ (CIBIL Score) తరహాలో వారికి ప్రత్యేక రేటింగ్ ఇచ్చి, ఆ రేటింగ్ ఆధారంగా విధులు కేటాయించే కొత్త విధానంపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఈవో వెల్లడించారు. భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరిచేందుకు సూచనలు స్వీకరించామని, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నాణ్యమైన సేవలు అందిస్తామని స్పష్టం చేశారు.

