Sonam Wangchuk: లడఖ్కు చెందిన ప్రముఖ విద్యావేత్త, సామాజిక-పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి హర్యానాలోని గురుగ్రామ్ మేదాంత ఆసుపత్రికి తరలించారు.
గత 24 రోజులుగా ఆయన మరణనిరాహార దీక్ష చేస్తుండటంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలో, ఆయనను మేదాంతకు తరలించాలని ఢిల్లీ హైకోర్టు మంగళవారం సాయంత్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.

ప్రత్యేక వైద్య బృందం సంరక్షణలో చికిత్స
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. AIIMS, సఫ్దర్జంగ్ వైద్యులతో పాటు వాంగ్చుక్ వ్యక్తిగత వైద్యుల నివేదికలను పరిశీలించిన కోర్టు, ఆయనకు నిరంతరం నిపుణుల వైద్య పర్యవేక్షణ అవసరమని స్పష్టం చేసింది. వాంగ్చుక్ ప్రతిపాదించిన మేదాంత ఆసుపత్రిలో ఆయన కోసం ప్రత్యేక వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించింది.
Sonam Wangchuk: హెల్త్ బులెటిన్: క్షీణించిన రక్త కణాలు, పొటాషియం స్థాయిలు
సఫ్దర్జంగ్ ఆసుపత్రి వైద్యులు విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఆయన ప్రధాన అవయవాల పనితీరు నిలకడగానే ఉన్నప్పటికీ, సుదీర్ఘ దీక్ష వల్ల శరీరానికి సరైన పోషకాలు అందక తీవ్రమైన పోషకాహార లోపం ఏర్పడింది. దీనివల్ల రక్త కణాల సంఖ్య తగ్గడం (పాన్సైటోపెనియా) తో పాటు సీరమ్ పొటాషియం స్థాయిలు బాగా పడిపోయాయి. దీంతో చికిత్సను నిరంతరాయంగా కొనసాగించేందుకు ఆయన మెడికల్ రికార్డులను మేదాంత వైద్యులకు అందజేశారు.
ఆసుపత్రిలోనూ కొనసాగనున్న నిరాహార దీక్ష
ఆసుపత్రి మార్పు జరిగినప్పటికీ, తన ఆందోళనను విరమించేది లేదని వాంగ్చుక్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన భార్య గీతాంజలి జె. ఆంగ్మో ధ్రువీకరించారు. ‘సంసద్ చలో’ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ను ఖండిస్తూ, వారికి మద్దతుగా ఆయన ఈ దీక్ష చేపట్టారు. NEET వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, విద్యా రంగంలో రావాల్సిన అత్యవసర సంస్కరణలపై పార్లమెంటులో చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ జూన్ చివరి వారం నుంచి ఆయన జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్నారు.
ప్రధాని నివాసం వద్ద ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు

