Sit-up : పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు శిక్షలు విధించడం సర్వసాధారణం. అయితే కార్పొరేట్ సంస్థల్లో టార్గెట్లు పూర్తి చేయలేదనే నెపంతో ఉద్యోగులతో గుంజీలు తీయించిన వింత సంఘటన చైనాలో వెలుగుచూసింది.
చైనాకు చెందిన ఒక లోన్ అసిస్టెన్స్ కంపెనీ తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు ప్రతిరోజూ కనీసం 200 ఫోన్ కాల్స్ చేయడంతో పాటు కొత్త క్లైంట్లను సంస్థకు తీసుకురావాలని కఠినమైన లక్ష్యాలను నిర్దేశించింది. అక్కడ పనిచేస్తున్న ‘యాంగ్’ అనే యువతి ఈ లక్ష్యాలను సాధించడంలో విఫలమవ్వడంతో కంపెనీ యాజమాన్యం ఆమెను వింతైన శిక్షకు గురిచేసింది. టార్గెట్ చేరుకోనందుకు ప్రతిఫలంగా రూ. 700 (సుమారు 60 యువాన్లు) జరిమానా చెల్లించాలి లేదా 200 గుంజీలు తీయాలని యజమానులు స్పష్టం చేశారు.

డబ్బులు లేక గుంజీలు తీసి ఆసుపత్రి పాలైన బాధితురాలు
జేబులో తగినంత సొమ్ము లేకపోవడంతో సదరు యువతి కంపెనీ విధించిన షరతు ప్రకారం 200 గుంజీలు తీయక తప్పలేదు. అయితే, ఒకేసారి అంతటి భౌతిక శ్రమకు గురికావడంతో ఆమె తీవ్రమైన కండరాల సమస్యలతో (మజిల్ ఇంజ్యూరీ) బాధపడింది. నడవలేని స్థితికి చేరుకున్న బాధితురాలు చివరికి ఆసుపత్రి పాలు కావడంతో పాటు, ఆ కఠినమైన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆఫీస్ మేనేజ్మెంట్ విధించిన ఈ ఆమానుష శిక్షకు సంబంధించిన ఉదంతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, నెటిజన్లు కార్పొరేట్ వేధింపులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

