Jagan Pressmeet: ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు (2029 ఎన్నికలు) ఆయన ఇప్పుడే ప్రధాన ఎజెండాను ఫిక్స్ చేశారు. వచ్చే ఎన్నికలు “మావిగన్ వర్సెస్ అమరావతి” (Mavigun vs Amaravati) మధ్యే జరుగుతాయని, ఈ రెండింటిలో ప్రజల మద్దతు దేనికి ఉందో ఆ ఎన్నికల తీర్పుతోనే తేలిపోతుందని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి తాము ప్రతిపాదించిన ‘మావిగన్’ విధానానికే వైఎస్సార్సీపీ పూర్తిగా కట్టుబడి ఉందని, దీనికి మద్దతు ఇచ్చే వారంతా తమ పార్టీకే ఓటు వేస్తారని జగన్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని అధికారికంగా చేరుస్తామని ప్రకటించారు.
Read Also:AP EAPCET Results 2026: మరి కాసేపట్లో ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

అసలేమిటి ఈ ‘మావిగన్’ (MAVIGUN) ప్రతిపాదన?
రాష్ట్రానికి భారీ ఆర్థిక భారం లేకుండా, సహజసిద్ధమైన వృద్ధి సాధించేందుకు జగన్ మోహన్ రెడ్డి ఒక సరికొత్త ‘ప్లాన్-బి’ (Plan-B) రాజధాని కారిడార్ను తెరపైకి తెచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ 110 కిలోమీటర్ల మేర ఈ సరికొత్త రాజధాని జోన్ను ప్రతిపాదించారు. ఆయా నగరాల పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి ఈ పేరు పెట్టారు:
- MA – మచిలీపట్నం (Machilipatnam)
- VI – విజయవాడ (Vijayawada)
- GUN – గుంటూరు (Guntur)
చంద్రబాబు ప్రతిపాదిస్తున్న అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చవుతాయని, అదే ఈ ‘మావిగన్’ కారిడార్ను అభివృద్ధి చేయడానికి అందులో 10 శాతం నిధులు కేటాయిస్తే సరిపోతుందని జగన్ పేర్కొన్నారు. మచిలీపట్నం పోర్ట్ అందుబాటులోకి రావడం వల్ల ఇది ముంబై, చెన్నై తరహాలో అద్భుతమైన ‘పోర్ట్ సిటీ’గా మారుతుందని ఆయన వివరించారు.
Jagan Pressmeet: బాబు అవినీతిపైనే నా పోరాటం..
తాను అమరావతి ప్రాంతానికి వ్యతిరేకమంటూ కూటమి నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. “నేను అమరావతికి ఎన్నడూ వ్యతిరేకం కాదు. కానీ, అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు సాగిస్తున్న ఇన్సైడర్ ట్రేడింగ్, భూ స్కామ్లను, అవినీతిని మాత్రమే నేను మొదటి నుండి ప్రశ్నిస్తున్నాను. ఎలాంటి అవినీతి లేని, స్వయంసమృద్ధి గల రాజధాని ప్రాంతం ఏర్పడాలనేదే నా ఆకాంక్ష. అందుకే ఈ ప్రాక్టికల్ ప్రతిపాదనను తెచ్చాం.” - వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు మారినప్పుడు చట్టాలను సవరించుకునే హక్కు అసెంబ్లీకి ఉంటుందని, చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టడానికే డ్రామాలు ఆడుతున్నారని జగన్ విమర్శించారు. జగన్ చేసిన ఈ తాజా ‘మావిగన్’ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ రాజధాని చిచ్చును రాజేసాయి.
Epaper: epaper.vaartha.com

