Smell of the earth as soon as it Rains : ఎండ తీవ్రతకు అల్లాడిపోయిన నేలను తాకుతూ తొలి వర్షపు చినుకు పడగానే ఒక అద్భుతమైన మట్టి వాసన వస్తుంది. మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని, ప్రశాంతతను పంచే ఈ సువాసన వెనుక ఒక ఆసక్తికరమైన శాస్త్రీయ కారణం దాగి ఉంది.
సైన్స్ భాషలో ఈ మట్టి వాసనను ‘పెట్రిచోర్’ (Petrichor) అని పిలుస్తారు. వర్షం పడటానికి ముందు లేదా కురిసే సమయంలో నేలలో ఉండే ‘స్ట్రెప్టోమైసిస్’ (Streptomyces) అనే ఒక రకమైన శ్రేష్ఠమైన బ్యాక్టీరియా చురుగ్గా మారుతుంది. ముఖ్యంగా ఎండల కాలంలో మట్టి పూర్తిగా ఎండిపోయినప్పుడు, ఈ బ్యాక్టీరియా తట్టుకుని జీవించడానికి ఒక రకమైన బీజాంశాలను (Spores) విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియే ఆ తర్వాత వచ్చే సువాసనకు పునాదిగా మారుతుంది.

'జియోస్మిన్' రసాయన గారడీ.. గాలిలో ఓజోన్, మొక్కల నూనెల కలయిక!
ఎండిన నేలపై వర్షపు చినుకులు పడగానే, ఆ నీటి బిందువుల ఒత్తిడికి మట్టిలో దాగివున్న ‘జియోస్మిన్’ (Geosmin) అనే రసాయన సమ్మేళనం గాలి బుడగల రూపంలో పైకి లేచి వాతావరణంలోకి వేగంగా వ్యాపిస్తుంది. మానవ ముక్కు ఈ జియోస్మిన్ వాసనను చాలా సున్నితంగా పసిగట్టగలదు. దీనికి తోడు, పొడి వాతావరణంలో మొక్కలు విడుదల చేసే కొన్ని రకాల సహజ నూనెలు కూడా మట్టిలో చేరి ఉంటాయి. వర్షం పడే సమయంలో ఆకాశంలో వచ్చే మెరుపుల వల్ల వాతావరణంలోని ఆక్సిజన్ అణువులు విడిపోయి ‘ఓజోన్’ (Ozone) వాయువుగా మారుతాయి. ఈ ఓజోన్, మొక్కల నూనెలు మరియు జియోస్మిన్ రసాయనం.. ఈ మూడూ కలిసి గాలి ద్వారా మనకు చేరడం వల్లే వర్షం రాగానే అంతటి ఆహ్లాదకరమైన, మధురమైన మట్టి సువాసన వస్తుంది.

