Chandrababu Naidu: వెలిగొండ ప్రాజెక్టు భూనిర్వాసితులు, రైతులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన ముఖాముఖి సమావేశం తీవ్ర భావోద్వేగాల మధ్య సాగింది.
మార్కాపురం జిల్లా దోర్నాల పర్యటనలో భాగంగా శనివారం వెలిగొండ ప్రాజెక్టు పనులను సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం యర్రగొండపాలెంలో ఏర్పాటు చేసిన సదస్సులో బాధితులు, స్థానిక రైతులతో ఆయన నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వాసితులు తమ మూడు దశాబ్దాల గోడును వెళ్లబోస్తూ ముఖ్యమంత్రి ఎదుటే కన్నీటిపర్యంతమయ్యారు.

గత ప్రభుత్వ వేధింపులు.. సీఎం ఎదుట బాధితుల ఆవేదన
సమావేశంలో సుంకేశుల గ్రామానికి చెందిన దూదేకుల ఖాసీం వలీ అనే నిర్వాసితుడు మాట్లాడుతూ.. తమ కష్టాలను గుర్తించి, సరైన పరిష్కారం చూపింది చంద్రబాబు మాత్రమేనని కొనియాడారు. పునరావాసం కోసం సీఎం స్వయంగా రూ. 300 కోట్ల నిధులతో రావడం తమ అదృష్టమంటూ భావోద్వేగానికి లోనయ్యారు. గత ప్రభుత్వ హయాంలో తాము అనుభవించిన నరకాన్ని పలువురు రైతులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తమకు దక్కాల్సిన పునరావాస హక్కుల కోసం పోరాడితే.. అక్రమ కేసులు బనాయించి, జైళ్లకు పంపి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించిన పునరావాస ప్యాకేజీ వల్ల తమ పిల్లల చదువులకు, భవిష్యత్తుకు కొండంత భరోసా దొరికిందని హనుమ ప్రసాద్ అనే మరో నిర్వాసితుడు హర్షం వ్యక్తం చేశారు. తమ 30 ఏళ్ల నిరీక్షణ ఫలించిందనే ఆనందంతో కొందరు రైతులు సీఎం పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించగా, చంద్రబాబు వారిని ఆప్యాయంగా వారించారు.
Chandrababu Naidu: మీ త్యాగానికి గ్యారెంటీ నాది: చంద్రబాబు హామీ
రైతులు, నిర్వాసితుల బాధలను ఓపికగా విన్న ముఖ్యమంత్రి వారికి పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. "నాలుగు జిల్లాల ప్రజల భవిష్యత్తును మార్చే ఈ వెలిగొండ ప్రాజెక్టు కోసం మీ ఊళ్లను, భూములను త్యాగం చేశారు. మీ త్యాగం వెలకట్టలేనిది. ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చూసే బాధ్యత, గ్యారెంటీ నాది" అని చంద్రబాబు స్పష్టం చేశారు. రైతుల మధ్యే కూర్చుని వారితో సాధారణ వ్యక్తిలా సీఎం ముచ్చటించడం అందరినీ ఆకట్టుకుంది.
ఒకేసారి రూ. 300 కోట్ల ఆర్ అండ్ ఆర్ నిధులు
అధికారుల సమాచారం ప్రకారం.. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 7,225 మంది నిర్వాసితులు ఉన్నారు. అయితే, గత ప్రభుత్వం కేవలం 96 మందికి మాత్రమే పునరావాస (R&R) నిధులు ఇచ్చి చేతులు దులుపుకుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం శనివారం నాటి కార్యక్రమంలోనే ఒకే విడతగా 2,351 మంది నిర్వాసితులకు రూ. 300 కోట్ల నిధులను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున రైతులు, నిర్వాసితులు పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com

