Veligonda Phase-1 : ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి, ముఖ్యంగా కరువు పీడిత ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు తాగు, సాగునీరు అందించే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రాజెక్టు మొదటి విడత (ఫేజ్-1) పనుల పురోగతి మరియు ఖర్చుల నిధుల వివరాలను వెల్లడిస్తూ, ఈ ప్రాజెక్టుకు పునాది వేసింది, దానిని పూర్తి చేసి జాతికి అంకితం చేసేది కూడా తానేనని స్పష్టం చేశారు. నాటి కాంగ్రెస్, వైకాపా ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్ట్ నిర్మాణం దశాబ్దాల పాటు తీవ్ర జాప్యం జరిగిందని విమర్శించారు. ప్రాజెక్ట్ వ్యయంలో దాదాపు 50 శాతం నిధులను తమ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఖర్చు చేశామని, రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాల వర్షాభావ ప్రాంతాలను సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించారు.

గణాంకాలతో కౌంటర్: నిధుల వ్యయంపై చంద్రబాబు స్పష్టత
ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మరియు కేటాయింపులపై స్పష్టమైన గణాంకాలను బయటపెడుతూ సీఎం చంద్రబాబు ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపు 11 ఏళ్లు ముఖ్యమంత్రులుగా ఉండి కేవలం రూ. 2,175 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అలాగే వైఎస్ఆర్ అనంతర ఐదేళ్ల కాలంలో వచ్చిన ఇద్దరు సీఎంలు రూ. 2,417 కోట్లు వ్యయం చేశారని గుర్తుచేశారు. తమ ప్రభుత్వ పాలనలోనే ఇప్పటికే రూ. 3,256 కోట్లు ఖర్చు చేశామని, మిగిలిన రూ. 1,906 కోట్ల పనులను సైతం అత్యంత వేగంగా పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రాజెక్ట్ మొత్తం రూ. 10,200 కోట్ల అంచనా వ్యయంలో ఒక్క తమ హయాంలోనే 50 శాతానికి పైగా నిధులు వెచ్చించడం కరువు ప్రాంతాల అభివృద్ధి పట్ల తమకు ఉన్న నిబద్ధతకు సజీవ నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు.

