విద్య, వైద్యం వంటి మౌలిక అవసరాల విషయంలో తప్ప మిగతా రంగాల్లో ఉచితాల అవసరం లేదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు(VenkaiahNaidu) స్పష్టం చేశారు.
ఉచిత పథకాల పేరుతో ప్రజలను పని చేయకుండా అలవాటు చేస్తే దేశ అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాలలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి శతజయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉచితాల రాజకీయాలు సమాజాన్ని వెనక్కి నెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
'ఫ్రీ బస్సులు ఇవ్వమని ప్రజలు అడిగారా? ఉచితాల పేరుతో వారిని సోమరులుగా మార్చుతున్నారు. వాటిని ఆపేసి నిజంగా కష్టపడే వారికి అవకాశాలు, సహాయం అందించాలి' అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రజలను ఆశ్రయితులుగా కాకుండా స్వయం సమృద్ధిగా తయారు చేయాలని సూచించారు.
అటల్ బిహారి వాజ్పేయి నాయకత్వాన్ని కొనియాడిన వెంకయ్య నాయుడు(VenkaiahNaidu), ఆయన ఎప్పుడూ దేశ ప్రయోజనాలనే ప్రథమ స్థానంలో పెట్టేవారని గుర్తు చేశారు. రాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాలు, సేవాభావం ముఖ్యమని, యువత ఈ అంశాలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత కాలంలో రాజకీయ నాయకులు తక్షణ లాభాల కోసం ఉచిత పథకాలను ఆశ్రయిస్తున్నారని, దీని వల్ల దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని అన్నారు. విద్య, వైద్యం రంగాల్లో పెట్టుబడులు పెడితే దేశ భవిష్యత్ బలపడుతుందని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com

