VRO : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల (VRO) సర్వీస్ రూల్స్లో సంచలన మార్పులు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్-సర్వీస్ కోటా కింద విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (VRA) స్థాయి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్హత ప్రాతిపదికన వీఆర్వోలుగా ప్రమోషన్ పొందిన ఉద్యోగులు విధిగా ఐదేళ్ల వ్యవధిలో డిగ్రీ అర్హత సాధించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఒకవేళ నిర్దేశిత ఐదేళ్ల గడువులోగా డిగ్రీ పూర్తి చేయడంలో విఫలమైతే, వారిని తిరిగి వీఆర్ఏలుగానే డిమోట్ (రివర్షన్) చేస్తామని రెవెన్యూ శాఖ కఠినమైన నిబంధనను చేర్చింది. గ్రామ స్థాయిలో పాలన, రెవెన్యూ సేవలను మరింత సమర్థవంతంగా అందించే లక్ష్యంతోనే ఈ విద్యా అర్హతల నిబంధనను కఠినతరం చేసినట్లు స్పష్టమవుతోంది.

ఇప్పటికే రెండుసార్లు అవకాశం.. చివరిగా మరో ఐదేళ్ల గడువు పెంపు!
గతంలోనే పదోన్నతి పొందిన వీఆర్వోలకు విద్యా అర్హత పెంచుకోవడానికి ప్రభుత్వం ఇదివరకే రెండుసార్లు అవకాశం ఇచ్చినప్పటికీ, చాలామంది ఉద్యోగులు డిగ్రీ విద్యార్హతను సాధించలేకపోయారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం, ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చివరి అవకాశంగా మరొక ఐదేళ్ల గడువును ఇస్తూ తుది ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పొడిగించిన వ్యవధిలోగా అర్హత సాధించని వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయింపులు ఉండవని, రివర్షన్ చర్యలు తప్పవని అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇన్-సర్వీస్ కోటా వీఆర్వోలు త్వరితగతిన ఉన్నత విద్యను పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

