బీహార్లో జైలజైన్ 'జాంబీ డ్రగ్' కలకలం రేపుతోంది. ఈ డ్రగ్ తీసుకున్న యువకుడు బొమ్మలా నిలబడిన వీడియో వైరల్ అవుతోంది.
విధాత : బీహార్లో 'జైలజైన్' అనే ప్రమాదకరమైన డ్రగ్ కలకలం రేపుతోంది.
ఈ డ్రగ్ తీసుకున్న ఒక యువకుడు గంటల తరబడి రోడ్డుపై కదలకుండా బొమ్మలా నిలబడిపోవడంతో స్థానికులు షాక్కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. మెదడు పనితీరును మొద్దుబార్చే ఈ డ్రగ్ ప్రభావంతో మనుషులు స్పృహలో ఉన్నా ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్లిపోతారు. ఓ రకంగా హాలీవుడ్ సినిమాలోని జాంబీల మాదిరిగా ప్రవర్తిస్తుంటారు. అందుకే ఇంటర్నెట్లో దీనిని 'జాంబీ డ్రగ్' అని పిలుస్తున్నారు.
ఈ వింత ప్రవర్తనకు కారణమైన డ్రగ్ మెదడు పనితీరును పూర్తిగా స్తంభింపజేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రగ్ బారిన పడిన వారు తాము ఏం చేస్తున్నామో తెలియని స్థితిలోకి వెళ్లిపోతారని, ఇది ప్రాణాలకే ముప్పు తెచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బీహార్ తో పాటు జాంబీ డ్రగ్ ఘటనలు బెంగళూరు నగరంలోనూ వెలుగు చూడటం మరింత ఆందోళన కల్గిస్తుంది. ఈ మత్తు పదార్థాల విక్రయాల వెనుక ఉన్న ముఠాల గురించి పోలీసులు నిఘా పెంచారు. యువత ఇలాంటి ప్రాణాంతక అలవాట్లకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

