Heat Wave | రాష్ట్రం నిప్పుల కొలిమిలా తయారైంది. భానుడి భగభగలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Heat Wave | హైదరాబాద్ : రాష్ట్రం నిప్పుల కొలిమిలా తయారైంది. భానుడి భగభగలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సోమవారం తెలంగాణలోని 13 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా, ఆరు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళ, బుధ, గురువారాల్లోనూ ఈ స్థాయిలోనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వడగాలుల తీవ్రత కూడా కొనసాగే అవకాశం ఉందని కూలీలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మంగళవారం నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, ములుగు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక తొమ్మిది జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. బుధ, గురువారాల్లోనూ పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయంటూ 'ఆరెంజ్' హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు మరింత ఆలస్యం కానుంది. వాస్తవానికి ఈ నెల 26న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ నాలుగైదు రోజులు ఆలస్యంగా తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని జూన్ 5 నుంచి 10 మధ్య నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మాన్సూన్ సీజన్పై ఎల్నినో ప్రభావం పడనుందని.. జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్లో దీని ప్రభావం చూపనుందని వెల్లడించింది. దీంతో తెలంగాణలో లోటు వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

