హైదరాబాద్లో దోమల సమస్యపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న నిరసన. అసెంబ్లీలో దోమతెరతో ప్రెస్మీట్ చేసి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.
విధాత,హైదరబాద్ : గ్రేటర్ హైదరాబాద్లో దోమలను అరికట్టి..
నగర వాసులను కాపాడాలని బీఆర్ఎస్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దోమల సమస్య తీవ్రతకు నిరసనగా అసెంబ్లీ ఆవరణలోని మీడియా హాల్లో ఫాగింగ్ మిషన్, దోమ తెరలతో ప్రెస్ మీట్ పెట్టేందుకు ప్రయత్నించారు. అందుకు అనుమతి లేదని మార్షల్స్ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. బలవంతంగా ఫాగింగ్ మిషన్ ,దోమతెరలను లాక్కెళ్లారు.
అనంతరంసుధీర్ రెడ్డి దోమ తెర ధరించి ప్రెస్ మీట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దోమలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందన్నారు. దోమల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో భయంతో ప్రజలు పారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యాతో ప్రజలు ఆసుపత్రుల పాలవుతూ ఆర్థికంగా చితికిపోతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. దోమల నివారణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ప్రభుత్వం స్పందించి సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దోమల ఫాగింగ్ తో,డ్రోన్ స్ప్రే పాటు చెరువులలో గుర్రపు డెక్క తొలగించి..వాటిని శుభ్రం చేయాలని, లార్వా స్థాయిలోనే దోమలను అరికట్టేందుకు గాంబూసియా చేపలను చెరువుల్లో వదలాలని డిమాండ్ చేశారు.

