తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చాయి. టీఎస్డీపీఎస్ డేటా ప్రకారం నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.
Telangana Heatwave: Summer Temperatures Touch 46.5°C, Nirmal Records Season's Highest
విధాత తెలంగాణ డెస్క్ | మే 20, 2026:
Telangana Heatwave | హైదరాబాద్: తెలంగాణలో ఎండలు మళ్లీ భగభగలాడుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ను దాటాయి. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికా సంఘం - టీఎస్డీపీఎస్ సమాచారం ప్రకారం, ఈ వేసవి సీజన్లోనే అత్యధికంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా కనిపించింది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్, కరీంనగర్ జిల్లా చొప్పదండి, పెద్దపల్లి జిల్లా ఓదెలలో 46.4 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా రాయికల్, జనగామ జిల్లా వడ్లకొండ, ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రాంతాల్లో 46.3 డిగ్రీల సెల్సియస్ నమోదుకాగా, సిద్ధిపేట జిల్లా కోహెడలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
వాతావరణ పరిస్థితులను గమనిస్తున్న తెలంగాణ వెదర్మ్యాన్ లాంటి స్వతంత్ర వాతావరణ పరిశీలకులు కూడా రాష్ట్రంలో తీవ్ర ఉష్ణోగ్రతల పెరుగుదలను గుర్తించారు. మధ్య భారతదేశం, దక్షిణాది ప్రాంతాలపై కొనసాగుతున్న వేడి గాలుల ప్రభావం తెలంగాణపై స్పష్టంగా కనిపిస్తోందని వారు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత ప్రజలను బాగా ఇబ్బందులకు గురిచేస్తోంది.
భారత వాతావరణ శాఖ హైదరాబాద్ విభాగం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలుల పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలిపింది. ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్కు పైగా నమోదయ్యే అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లోనూ 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండొచ్చని అంచనా వేసింది.
టీఎస్డీపీఎస్ డేటా, ఐఎండీ అంచనాలు, స్థానిక వాతావరణ పరిశీలకుల వివరాలు చూస్తే.. తెలంగాణలో ఈ వేసవి మరింత కఠినంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఎండలతో మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లడం ప్రజలకు కష్టంగా మారింది. రోడ్లపై ఎటు చూసినా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది.
తీవ్ర ఎండల మధ్య విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది తరచూ నీరు తాగుతూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ వేసవిలో తొలిసారి రాష్ట్రంలో 46.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. టీఎస్డీపీఎస్ డేటా ప్రకారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు ఇవి:
ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి చేరిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో అనవసరంగా బయటకు వెళ్లకుండా ఉండటం, తగినంత నీరు తాగడం, వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని చెబుతున్నారు.
ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు రావొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
వడగాలుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని, ప్రయాణాలను సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవాలని సూచించారు. వడగాలుల ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వేసవి పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ, జిల్లా కలెక్టర్లకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. ఆసుపత్రుల్లో వడదెబ్బ బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉండాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. స్థానిక సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉంచాలని కూడా ఆదేశించారు.
రాష్ట్రంలో వడగాలుల పరిస్థితులు మరికొన్ని రోజులు కొనసాగితే, సాధారణ ప్రజలతో పాటు రైతులు, కూలీలు, బహిరంగ ప్రదేశాల్లో పని చేసే కార్మికులపై ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ప్రభుత్వ విభాగాలు, స్థానిక సంస్థలు తాగునీరు, నీడ, అత్యవసర వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా ఈ వేసవి తీవ్రత స్పష్టంగా కనబడుతోంది. సాధారణంగా సింగరేణి ప్రాంతాలలో ఉండే ఉష్ణోగ్రతలు ఈసారి ఇతర జిల్లాల్లో కూడా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 46.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవడం ఎండ తీవ్రతకు సంకేతంగా మారింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం.

